బీసీ గణన విషయమై అధికార వైసీపీ, చట్ట సభల వేధికగా చేసిన ప్రసంగాలు తెలుగునాట చర్చనీయాంశంగా మారాయి. ఏ ప్రభుత్వమైనాసరే, బీసీల్ని ఉద్ధరించేశామనే చెబుతుంటుంది. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్.. అని చెప్పడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారిపోయింది.
మరి దశాబ్దాలుగా బీసీలంటే వెనుకబడిన వర్గాలుగానే ఎందుకు మిగిలిపోతున్నట్టు.? నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ పదవులు, మంత్రి పదవులతో బీసీలు ఉద్ధరింపబడతారా.? సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే బీసీలకు మేలు జరుగుతుందా.? ఈ అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది జన బాహుళ్యంలో.
బీసీలంటే రాజకీయ పార్టీలకు ట్రంప్ కార్డు అనే చెప్పాలి. బీసీలు మాత్రమే కాదు, దళితులైనా, మైనార్టీలైనా, ఇంకో వర్గమైనా.. దేన్నయినా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులానే చూస్తుంటాయన్నది బహిరంగ రహస్యం. ఇందులో దాపరికమేమీ లేదు.
ఆయా వర్గాలకు ప్రత్యేకంగా పదవులు కట్టబెట్టడం, తద్వారా.. ఆ వర్గాల్ని ఉద్ధరించేశామని ప్రచారం చేసుకోవడం.. ఇదేమీ కొత్త కాదు. ఆయా వర్గాల నుంచి నాయకులుగా ఎదిగినవారు, ఆయా వర్గాల్ని ఉద్ధరించిన సందర్భం ఏనాడైనా చూశామా.?
ఓ బీసీ నాయకుడు ఇంకో బీసీ నాయకుడ్ని తిడతాడు.. ఓ దళిత నాయకుడు ఇంకో దళిత నాయకుడ్ని దూషిస్తాడు. ఇదే నేటి రాజకీయ సిత్రం. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు. అన్ని పార్టీల్లోనూ ఇదే తంతు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఆ తర్వాత ఏం చేశారో చూశాం.
ఇక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికొస్తే, సలహాదారులే కావొచ్చు.. అధికార వైసీపీలో కీలక పదవులే కావొచ్చు.. కీలకమైన నామినేటెడ్ పోస్టులే కావొచ్చు.. ‘హలీ రెస్పెక్టెడ్’ సామాజిక వర్గానికి తప్ప, ఇతరులకు దక్కింది చాలా చాలా తక్కువ. బీసీల మీద రాజకీయ పార్టీల ప్రేమేంటో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?