ఆయన ఓ ప్రజా ప్రతినిథి.! ప్రజల ఓట్లతో చట్ట సభల్లోకి అడుగు పెట్టినోడు. ఓటర్లను ఉద్దేశించి, ‘మీకు సిగ్గూ శరం వుంటే..’ అంటూ రెచ్చిపోయాడు.! నిజమేనేమో, ఓటర్లకు సిగ్గూ, శరం.. ఇలాంటివేమన్నా వుంటే, సదరు ‘నేత’, చట్ట సభలకు వెళ్ళి వుండేవాడు కాదు.!
సదరు ప్రజా ప్రతినిధి పేరు ఎంఎస్ బాబు. వైసీపీ నేత, పూతలపట్టు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారాయన. ‘సిగ్గూ శరం వుంటే, సంక్షేమ పథకాల లబ్దిదారులు, వాటిని వెనక్కిచ్చేయాలి..’ అంటున్నారు ఎంఎస్ బాబు.!
ఇంతకీ, సంక్షేమ పథకాలంటే, రాజకీయ నాయకుల జేబుల్లోంచి ఖర్చు చేస్తున్నవా.? ‘సిగ్గూ శరం వుంటే..’ అంటూ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సెలవిచ్చారంటే, అలాగనే అనుకోవాలేమో.!
కొన్నాళ్ళ క్రితం.. అంటే, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, ‘నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు.. నాకు ఓటెయ్యరా.?’ అంటూ ప్రశ్నించేశారు. ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా.? చేసేశారు మరి.!
చంద్రన్న పేరుతో అప్పట్లో సంక్షేమ పథకాలు.. ఇప్పుడేమో, జగనన్న పేరుతో సంక్షేమ పథకాలి.! సంక్షేమ పథకాలకు నాయకుల పేర్లు పెట్టుకుంటే ఇలాగే వుంటుంది. అప్పట్లో చంద్రన్న కానుక, ఇప్పుడేమో జగనన్న కానుక. అక్కడికేదో చంద్రబాబు, వైఎస్ జగన్.. రాళ్ళు కొట్టి సంపాదించిన సొమ్ముల్ని జనానికి సంక్షేమ పథకాల రూపంలో పంచుతున్నట్టుంది.
నిజమే, ఓటర్లకు సిగ్గూ శరం లేదు.! ఎవరిని చట్ట సభలకు పంపుతున్నామో ఒకింత సోయతో ఓటర్లు ఆలోచిస్తే, ఇదిగో.. ఇలా ‘సిగ్గూ శరం లేదు’ అనే మాటలు పడాల్సిన ఖర్మ పట్టదు మరి.!