వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే, అప్పుడే కాదు లెండి.. ఇంకాస్త సమయం వుంది. 2027లో పాదయాత్ర వుంటుందన్నది వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట.
కాస్త ముందుగానే.. అంటే, 2026 చివర్లో పాదయాత్ర ప్రారంభించే అవకాశాలూ లేకపోలేదుట. ఎందుకీ పాదయాత్ర.? అంటే, గతంలో తనకు పాదయాత్రే అధికార పీఠాన్ని ఇచ్చిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు గనుక.
నారా లోకేష్ పాదయాత్ర, టీడీపీకి అధికారం తెచ్చిందని కూడా వైసీపీ పరోక్షంగా అంగీకరించక తప్పని పరిస్థితి. అంతకు ముందు, చంద్రబాబు కూడా పాదయాత్ర చేసే అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు కంటే ముందు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పాదయాత్ర ద్వారానే, అధికార పీఠమెక్కారు.
సరే, పాదయాత్ర చేసే హక్కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. పైగా, పాదయాత్ర ఆయనకు అలవాటే. కానీ, ఒకప్పటి పాదయాత్రలకీ, ఇప్పటి పాదయాత్రలకీ చాలా తేడా. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర కూడా, ‘మార్నింగ్ వాక్.. ఈవినింగ్ వాక్’ అన్నట్లే వుండేది.
అక్రమాస్తుల కేసులో కోర్టు యెదుట వ్యక్తిగత విచారణకు హాజరవ్వాల్సి వున్న వైఎస్ జగన్, దాన్ని తప్పించుకునేందుకు పాదయాత్ర చేశారన్నదీ కాదనలేని వాస్తవం. ఈసారి కూడా అంతేనా.? అంటే, దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే, పాదయాత్ర అంటే బోల్డన్ని ఖర్చులుంటాయి. కొంత ఖర్చు పార్టీ పెడితే, ఇంకొంత ఖర్చు స్థానిక నాయకులు పెట్టుకోవాలి. ఇక్కడే, వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నాయకులు తీవ్రంగా నష్టపోయిన మాట వాస్తవం.
వై నాట్ 175 అని వైఎస్ జగన్ చెబితే, గుడ్డి నమ్మేసి, అవసరానికి మించి ముందుగా ఖర్చు చేసేసి, చేతులు కాల్చుకున్నారు వైసీపీ నేతలు. ఎన్నికల్లో ఓడిపోయాక, మరిన్ని ఆర్థిక ఇబ్బందులు వైసీపీ నేతల్ని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాదయాత్ర అంటేనే, ఖర్చు దండగ వ్యవహారం.. అనేస్తున్నారట వైసీపీలో.
మరీ, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు, ‘ఖర్చు మా వల్ల కాదు’ అని అధినాయకత్వానికి ఆల్రెడీ తేల్చి చెప్పేశారన్నది ఇన్సైడ్ సోర్సెస్ నుండి అందుతున్న సమాచారం.
