టీటీడీకి చెందిన ఎస్ వి గోశాలపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సడెన్ ఏపీ రాజకీయాల్లోకి ఈ గోశాలను తీసుకురావడం వెనక వైసీపీ కుట్ర దాగి ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం జగన్ ను సనాతన ధర్మ పరిరక్షకుడు అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చేస్తోంది. గోశాలలో 100 గోవులు చనిపోయాయని.. కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. అపచారం అంటూ నానా హైరానా చేస్తోంది. ఫేక్ ప్రచారాలతో వైసీపీ కొత్త సింపతీ డ్రామాలకు తెర తీసింది. ఇదంతా చేయడానికి అసలు కారణం వేరే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయింది.
అందులో భాగంగానే గోశాలలపై విజిలెన్స్ నివేదిక రెడీ చేస్తోంది. ఈ నివేదికలో వైసీపీ హయాంలో జరిగిన అనేక అక్రమాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సస్పెండ్ అయిన మాజీ గోశాల అధికారి హరినాథ్ రెడ్డికి సమాచారం వెళ్లింది. అతను ఈ విషయాన్ని మాజీ టీటీడీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డికి చేరవేశారు. తమ అక్రమాలు ఎక్కడ బయటపడుతాయో అనే భయంతో వైసీపీ గోవుల మరణాలు అనే విషయాన్ని తెరమీదకు తెచ్చింది. తమ మీద నింద పడకముందే కూటమి మీద బురద జల్లితే ఎఫెక్ట్ పెద్దగా ఉండదని భావించారు కాబోలు. అందుకే హరినాథ్ రెడ్డి ఇచ్చిన అచ్చీరాని సమాచారంతో భూమన కరణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ గోశాలలో 100 గోవులు చనిపోయాయి అంటూ సంచలనానికి తెరతీశాడు.
అక్కడి నుంచే ఈ వివాదం ముదురుతోంది. దీన్ని టీటీడీ అధ్యక్షుడు బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. అలాంటిదేం లేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని భూమనపై ఆయన విరుచుకుపడ్డారు. హరినాథ్ రెడ్డి ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే ముందుగానే గోశాలపై ఆరోపణలు ప్రారంభించారు. వైసీపీ హయాంలో టీటీడీ గోసంరక్షణ శాలల్లో జరిగిన ఘోరాలు అన్నీఇన్నీ కావు. అప్పట్లో వారి హయాంలో గోవులు కుప్పలు, తెప్పలుగా చనిపోతే పట్టించుకోలేదు. చనిపోయిన వాటిని నిర్ధాక్షిణ్యంగా చెత్తబుట్టల్లో పడేశారు. నాసీరకం దాణాలు పెట్టి మూగజీవాల ప్రాణాలు తీశారు. ఇలా వందలాది గోవులు చనిపోయినా దాన్ని బయటకు రానివ్వకుండా అప్పటి అధికారి హరినాథ్ రెడ్డి మేనేజ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీ హయాంలో ఏప్రిల్, 2022 – జనవరి 2023 మధ్య ఎస్వీ గోశాలలో 27, పలమనేరు గోశాలలో 26, కమలయ్యగారిపల్లి గోశాలలో 7.. మొత్తం 60 ఆవులు, దూడలు చనిపోతే వాటిని కప్పిపుచ్చారని విజిలెన్స్ లో తేలింది. వైసీపీ హయాంలో గోశాలల నిర్వహణ అధ్వానంగా ఉండేది. సరైన పరిశుభ్రత పాటించలేదు. గోవులకు అనారోగ్యం వచ్చినా చికిత్స చేయించక చాలా వరకు చనిపోయాయి. చివరకు గోవుల దాణాకు పిలిచిన టెండర్లలో కూడా అవినీతి జరిగిందని నివేదిక చెబుతోంది. యర్రావారిపాళెంలో ఆవులు లేకున్నా.. అక్కడకు దాణా టెంటర్లు పిలిచారు హరినాథ్ రెడ్డి. లేని ఆవులకు దాణా పేరుతో రూ. 1.78 కోట్లు చెల్లింపులు జరిగిపోయాయి. అంతే కాకుండా బయో మెన్యూర్ని ఎన్రిచ్డ్ బయోమెన్యూర్గా తయారు చేసేందుకు టన్నుకు రూ.7,500 చొప్పున చెల్లించారు.
చాలా సార్లు ఎక్స్ పైర్ అయిపోయిన మందులను గోవులకు వాడారు. 2019-24 మధ్య విజిలెన్స్ తనిఖీల్లో గోశాల అక్రమాలు బట్టబయలైనా, గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఒక్క 2024లోనే 179 ఆవులు చనిపోయినా ప్రభుత్వం బయటకు రానివ్వకుండా తొక్కి పెట్టేసింది. 2021 జులై 22న విజిలెన్స్ నివేదిక ప్రకారం టీటీడీకి రూ.78 కోట్ల నష్టం వాటిల్లింది. కానీ దానిపై వైసీపీ ప్రభుత్వం విచారణ జరిపించలేదు. అప్పటి టీడీపీ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరించి వందలాది గోవుల మరణానికి కారణం అయింది. కానీ ఇప్పుడు కూటమి హయాంలో 2025 జనవరి–మార్చి మధ్య 2,700 గోవుల్లో 43 మాత్రమే చనిపోతే దానిపై వైసీపీ అవకాశ రాజకీయాలు చేస్తోందని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు నిర్వహణ మెరుగ్గా ఉందని.. గోవుల మరణాలు ఇప్పుడు తగ్గడమే కాకుండా రోజుకు 450 లీటర్ల పాల ఉత్పత్తిని 762 లీటర్లకు పెంచినట్టు చెబుతున్నారు.