కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు.. కొందరు పేదలకు మార్గదర్శకులుగా మారి వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే “P-4”. మొదటినుంచి దీనిపై వైసీపీ సానుకూల మీడియా విషం చిమ్ముతూనే ఉంది. తాజాగా మరో అడుగు ముందుకేసి “P-4” పై తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు గాను ప్రభుత్వం నియోజకవర్గం వారీగా ఒక సమన్వయ కర్తను నియమించేందుకు ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ, పీజీ చదివిన ఎవరైనా ఇందుకు అర్హులు. కాంట్రాక్ట్ బేసిస్ లో నియామకం ఉంటుందని స్పష్టం కూడా చేసింది. అయితే ఆ ఉద్యోగాలన్నీ కూటమి పార్టీ నేతలకే కట్టబెడుతున్నారంటూ వైసీపీ అనుకూల మీడియా విష ప్రచారానికి దిగింది. కూటమి పార్టీల నేతలు పదవి దాహాన్ని తీర్చుకునేందుకు ఈ పథకాన్ని వాడుకుంటున్నారంటూ తప్పుడు కథనాలు రాస్తోంది. పేదలకు, ధనికులకు మధ్య వారధిగా సమన్వయకర్త పేరుతో కూటమి పార్టీల నేతలే ఉంటారని ప్రచారం మొదలుపెట్టింది. P4 పాలసీని అడ్డుపెట్టుకుని పార్టీ పనులు చేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేసిన ఎత్తుగడని, ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నమేనని విమర్శించింది.
ఇవి కాదా దోపిడీకి నిదర్శనాలు?
P4 పాలసీ అమలు కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్న వైసీపీ మీడియా గత ఐదేళ్లలో ఆ ప్రభుత్వం పంచిన పందేరాలను మర్చిపోయినట్టుంది. నవరత్నాల ప్రచారం కోసం వైసీపీ తమ అనుకూల మీడియాకు ఏకంగా రూ.858 కోట్లు కట్టబెట్టింది. ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ ఎండి వాసుదేవరెడ్డిని డిజిటల్ కార్పొరేషన్ ఎండిగా ఉద్యోగం ఇచ్చి రూ. 2.63 కోట్ల వేతనం చెల్లించారు. సాక్షి పత్రిక కొనుగోలు చేయాలంటూ సచివాలయ వలంటీర్లకు నెలకు రూ. 200 చొప్పున చెల్లించేందుకు జీవో జారీ చేసి మరీ రూ. 203 కోట్లు దోచారు. అధిక సర్క్యులేషన్ ఉన్న ఈనాడు దినపత్రికకు రూ. 243 కోట్ల ప్రకటనలు ఇచ్చి.. రెండో స్థానంలో ఉన్న జగన్ మీడియా సాక్షి కి మాత్రం ఏకంగా రూ. 371 కోట్ల ప్రకటనలు ఇవ్వడాన్ని ఏమంటారో!. ఇక్కడ ఇంకో విషయం గురించి చెప్పుకోవాలి. గత ఐదేళ్లలో ఆంధ్రజ్యోతికి జారీ చేసిన ప్రకటనల విలువ కేవలం 27 లక్షల మాత్రమే. అసలు ఆ పత్రికను అసెంబ్లీలోకి ప్రవేశించకుండా బ్యాన్ చేసింది అది వేరే విషయం. వాలంటీర్ల వ్యవస్థకు శిక్షణ పేరుతో తమ అస్మదీయులకు రూ. 207 కోట్లు పంచిపెట్టారు. P4 విధానాన్ని అమలు చేయడం కోసం కోఆర్డినేటర్లను నియమించడం ప్రజాధనా దుర్వినియోగమే అయితే.. గత ఐదేళ్లపాటు వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చి.. వారితో పార్టీ పనులు చేయించుకోడాన్ని ఏమంటారో సాక్షి కే తెలియాలి.
