వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడిగా, ఆ పార్టీలో కీలక నేతలకు అత్యంత సన్నిహితుడిగా వుంటోన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంతలోనే, దేవిరెడ్డి శంకర్ రెడ్డి నుంచి ఓ లేఖ బయటకు వచ్చిందంటూ తెలుగు మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. సీబీఐకి ఆయన ఈ లేఖ రాశారట.
లేఖ సారాంశమేంటంటే, చంద్రబాబు హయాంలో అప్పటి సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సమక్షంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర జరిగిందట. టీడీపీ నేత బీటెక్ రవి హస్తం ఈ కుట్ర వెనుక వుందన్నది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆరోపణ.
తన రాజకీయ ఎదుగుదల కోసం బీటెక్ రవి ఈ హత్య చేయించారన్న అనుమానాలు వున్నాయని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కాగా, తన తండ్రికి ఈ హత్యతో సంబంధం లేదని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనయుడు చైతన్యరెడ్డి ఓ లేఖ రాయడం మరో ఆసక్తికరమైన పరిణామం.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఎవరున్నారో వైఎస్ వివేకా కుటుంబానికి తెలుసని శివశంకర్ రెడ్డి ఆరోపిస్తుండడం గమనార్హం. రెండేళ్ళు గడిచినా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులెవరో తేలకపోగా, కేసు పక్కదారి పట్టించేందుకు ఎప్పటికప్పుడు చిత్ర విచిత్రమైన వాదనలు తెరపైకొస్తున్నాయి.
‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై నేరుగా అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కానీ, చిత్రంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు కేంద్రంగా వివేకా హత్య కేసు విచారణ చేపట్టేందుకు చర్యలు చేపట్టలేదు.
మరోపక్క, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని వైఎస్ జగన్ చంపించి, రాజకీయ లబ్ది పొందారంటూ టీడీపీ ఆరోపించిందిగానీ, ఆ తర్వాత ఆ దిశగా టీడీపీ కూడా సీబీఐకి ఎలాంటి ఆధారాలు అందించలేదు. మొత్తంగా చూస్తే, వైఎస్ వివేకా హత్య చుట్టూ టీడీపీ – వైసీపీ 60-40 రాజకీయాలు నడుపుతున్నాయనే భావించాలేమో.
234375 400516Some genuinely good and utilitarian information on this web site , likewise I believe the style and design contains superb capabilities. 564954