వైసీపీకి, ఆ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకీ మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది.! అక్రమాస్తుల పంపకాల వ్యవహారంలో వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కుటుంబ వ్యవహారమని విజయమ్మ, షర్మిల చెబుతోంటే.. కాదు కాదు, ఇది రాజకీయ వ్యవహారం.. అన్నట్లుగా వైసీపీ నుంచి ఆ మధ్య ఓ లేఖ వచ్చింది.
అసలు ఆస్తులా.? అక్రమాస్తులా.? అన్నదానిపై పెద్ద డిబేట్ జన బాహుళ్యంలో నడుస్తోంది. 200 కోట్ల డివిడెండ్ షర్మిలకు ఇచ్చినట్లుగా ప్రకటించి వైఎస్ జగన్, సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఆ లెక్కన ఆస్తులు వందల కోట్లు కాదు, వేల కోట్లు కాదు, లక్షల కోట్లు అయి వుంటుందన్నది జనం డిసైడ్ అయిన అంశం.
ఇక, 2019 ఎన్నికల తర్వాత వైసీపీకి దూరమయ్యారు విజయమ్మ. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికీ ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. వైఎస్ షర్మిలతో కలిసి వైఎస్ విజయమ్మ ఏపీ రాజకీయాలు వదిలి, తెలంగాణకు పారిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం షర్మిల తిరిగి ఏపీ రాజకీయాల్లోకి వచ్చార్లెండి.
ఇదిలా వుంటే, కొన్నాళ్ళ క్రితం విజయమ్మ ప్రయాణిస్తున్న కొత్త కారు టైర్లు పేలిపోయాయ్. దీన్ని కుట్రగా అప్పట్లో చాలామంది అనుమానించారు. కొత్త కారు టైర్లు పేలిపోవడమేంటి.? అవును కదా.! ఆస్తుల పంపకాల నేపథ్యంలోనే ఇదంతా జరిగిందన్నది చాలామంది అనుమానం.
ఇప్పుడు నడుస్తున్న ఆస్తుల గొడవకీ, ఆ ప్రమాదానికీ లింకు పెట్టి, వార్తలు.. కొన్ని అదనపు హంగులతో కూడిన వార్తలూ బయటకు వస్తున్నాయ్. ఈ వ్యవహారాలు వైసీపీ మెడకి గట్టిగానే చుట్టుకున్నాయ్. దాంతో, వైసీపీ వ్యూహాత్మకంగా విజయమ్మ పేరుతో ఓ లేఖ రాసింది. ఆ ప్రమాదానికీ, తన కొడుక్కీ సంబంధం లేదన్నట్లుగా విజయమ్మ రాసిన లేఖలా వుందది.
కానీ, అందులో విజయమ్మ సంతకం ఫోర్జరీ అయ్యిందనే అనుమానాలు వైసీపీని మరింత ఇరకాటంలోకి నెట్టేశాయ్. వెంటనే వైసీపీ, ఆ లేఖని తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి తొలగించింది. ఇది ఇంకో పెద్ద సెల్ఫ్ గోల్ అయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.
వైసీపీ అంటేనే ఫేక్, ఫేక్ అంటేనే వైసీపీ.. అని ఇంకోసారి ప్రూవ్ అయ్యిందంటూ వైసీపీ మీద సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్నప్పుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసలీ ఆస్తుల పంచాయితీలు ఎందుకు.? తల్లికీ, చెల్లికీ అక్రమాస్తుల విషయంలో సెటిల్మెంట్ చేసెయ్యొచ్చు కదా.? అన్నది వైసీపీ శ్రేణుల వాదన.
వైసీపీ శ్రేణులే, దీన్ని అక్రమాస్తుల వ్యవహారం.. అని అభివర్ణిస్తున్న పరిస్థితి వచ్చిందంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే భావించాల్సి వుంటుంది. అయినాసరే, ‘తగ్గేదే లే..’ అని జగన్ అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?
ఇంతకీ, ఈ ఫేక్ లెటర్ విషయమై వైఎస్ విజయమ్మ స్పందిస్తారా.? తన తల్లికి తృటిలో తప్పిన కారు ప్రమాదంపై వైఎస్ షర్మిల వాదన ఏంటి.? దీనిపై ఇంకో లేఖ వైఎస్ షర్మిల నుంచి వస్తే, వైసీపీ పరిస్థితి ఏంటి.? వైఎస్ జగన్, బెంగళూరు నుంచి తిరిగొస్తే.. అప్పుడు మళ్ళీ ఈ వ్యవహారంపై స్పష్టత వస్తుందేమో.!
