జగన్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అయిపోయింది. ఇన్ని రోజులు జగన్-షర్మిల ఆస్తుల చుట్టూ వివాదాలు నడిచాయి. కానీ ఇప్పుడు అది పక్కకు పోయి జగన్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా లేదా అనేదానిపై పెద్ద చర్చ జరుగుతోంది. గతంలో అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే జగన్ మీద కూటమి ఎంత దారుణంగా ప్రచారం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ కు ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం కూడా లేదని.. ఆయనకు వేసిన ఓట్లకు విలువ ఇవ్వట్లేదని ప్రచారం జరిగింది.
చివరకు ప్రజల్లో కూడా దానిపై చాలా చర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మరి ఈ సారి అయినా జగన్ రాకపోతే మాత్రం ప్రజల్లో కూడా ఆయన మీద సానుభూతి తగ్గుతుందని అంటున్నారు. పైగా ఇప్పుడు షర్మిల కూడా పెద్ద సమస్యగా మారింది జగన్ కు. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోతే రాజీనామా చేయాలని.. ప్రజల ఓట్లకు విలువ ఇవ్వని వారు ఆ పదవులకు అనర్హులు అంటూ ఇప్పుడే ఆమె డిమాండ్లు చేస్తోంది. ఇది ఒక రకంగా జగన్ కు హెచ్చరికలు అనే చెప్పుకోవాలి.
రేపు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోతే పార్టీల నుంచే కాదు.. అటు ప్రజల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లే వస్తాయని గుర్తుంచుకోవాలి. పైగా సమావేశాలకు వెళ్తే జగన్ కు వచ్చే నష్టం కన్నా లాభమే ఎక్కువ. తనకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోయినా.. తనను ఏ మాత్రం అవమానించినా అది జగన్ కు సింపతీని పెంచుతుందే తప్ప తగ్గించదు. గతంలో చంద్రబాబుకు ఇవే ప్లస్ అయ్యాయి. కాబట్టి జగన్ వాటిని గుర్తు పెట్టుకుని వెళ్లాలని కోరుతున్నారు వైసీపీ శ్రేణులు.