సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంలో వింతేముంది.? యజమాని జగన్ మెప్పు కోసం, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి మీద అత్యంత అసభ్యకరమైన చర్చా కార్యక్రమాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించారు.
తనకు అత్యంత సన్నిహితుడైన ఇంకో మురికి జర్నలిస్టు కృష్ణంరాజుని తీసుకొచ్చి, అమరావతిపై ‘వేశ్యలకు రాజధాని’ అంటూ వ్యాఖ్యలు చేయించినందుకుగాను కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసులు నమోదవడం, ఈ క్రమంలో ఆయన అరెస్టవడం తెలిసిన విషయాలే.
సర్వోన్నత న్యాయస్థానంలో కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ వచ్చిన దరిమిలా వైఎస్ జగన్, ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీటేశారు. దాంతో, వైసీపీ శ్రేణులే ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే, న్యాయ వ్యవస్థల మీద గతంలో వైసీపీ నాయకులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అలాంటివి.
ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గతంలో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా చట్ట సభలపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించి, న్యాయ వ్యవస్థపై వైసీపీ నాయకులతో అవాకులు చెవాకులు పేలేలా చేసిన విషయం ఎలా మర్చిపోగలం.?
న్యాయ వ్యవస్థని చంద్రబాబు మేనేజ్ చేస్తారంటూ వైఎస్ జగన్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని వైసీపీ శ్రేణులే సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నాయి. ‘సత్యమేవ జయతే’ అని మనం ఎలా అనగలుగుతున్నాం.? అన్న వైసీపీ శ్రేణులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాదానం చెప్పుకోవాలి.
సాక్షి న్యూస్ ఛానల్ ద్వారా అమరావతి మీద ‘వేశ్యలకు రాజధాని’ అని దుష్ప్రచారం చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆధారాలతో సహా నిరూపించేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధమైంది.
సరిగ్గా ఈ తరుణంలో కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం, వైఎస్ జగన్ ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీటేయడం ఆశ్చర్యకరమే. వైసీపీ హయాంలో మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపిన వైఎస్ జగన్, ఇప్పుడు తన సొంత మీడియా ద్వారా నిత్యం దుష్ప్రచారాలు చేస్తూనే వున్న సంగతి తెలిసిందే.
