నిమ్మగడ్డ రమేష్కుమార్.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారి. నిన్నటిదాకా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేయకపోవడంతో ఆయనపై ఈ రోజు వేటు పడింది. అదీ, ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. దానికి అనుగుణంగా జీవో విడుదల చేసి, నిమ్మగడ్డ రమేష్కుమార్ని పదవి నుంచి తొలగించింది వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం.
ఐదేళ్ళ పదవీ కాలాన్ని మూడేళ్ళకే కుదిస్తూ ఈ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. విపక్షాలు న్యాయపోరాటం చేస్తామంటున్నాయి. న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. అయినా, న్యాయస్థానంలో మొట్టికాయలు వైఎస్ జగన్ సర్కార్కి అలవాటే.
ఒకవేళ న్యాయస్థానంలో తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. ఏం జరుగుతుంది.? అన్నది వేరే చర్చ. అయినా, పనిగట్టుకుని ఓ సామాజిక వర్గాన్ని వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా ‘సామాజిక వర్గం’ పేరుతో రాజకీయాలు చేయడం సబబేనా.? అధికారులపై ‘సామాజిక వర్గ కోణం’ ప్రదర్శిస్తూ వేటు వేయడం ఎంతవరకు సబబు.? అంటూ సోషల్ మీడియా వేదికగా జనం నుంచి ప్రశ్నలు సునామీలా పోటెత్తుతున్నాయి.
ఓ అధికారిని తొలగించాలా.? కొనసాగించాలా.? అన్నదానిపై ప్రభుత్వానికి కొన్ని పరిధులు, అధికారాలు, విచక్షణలు వుంటాయి. కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచక్షణ కోల్పోయారు. అవును, నిమ్మగడ్డ రమేష్కుమార్పై ‘కులం’ పేరు ప్రస్తావనకు తీసుకొచ్చి మరీ ఆరోపణలు చేశారు. ఇప్పుడు ‘కమ్మ’గా ఆర్డినెన్స్ జారీ చేసేసి పదవి నుంచి తొలగించేశారు.
ఇది ఆ అధికారికి అవమానమా.? అంటే, కాదనే చెప్పాలి. ఇక్కడ రాష్ట్రంలోని అధికార పార్టీ తన స్థాయిని దిగజార్చేసుకుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తనకు అనుకూలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఏరికోరి ఉన్నత స్థానాల్లో నిలబెడుతున్న అధికార పార్టీ, నచ్చని సామాజిక వర్గంపై ఇదంతా చేస్తోందని విపక్షాల నుంచి వస్తున్న విమర్శల్ని ఎలా తీసి పారేయగలం.? స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిపోలేదు. ఈ సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారం.. పెను దుమారమే రేపబోతోందన్నది నిర్వివాదాంశం.