ప్రభుత్వ నిర్ణయాలు బెడిసి కొట్టడం అనేది కొత్త విషయం కాదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కొన్నిసార్లు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్ని న్యాయస్థానాలు తప్పుపడుతుంటాయి. ఆయా నిర్ణయాల్ని ప్రజలు కావొచ్చు, ప్రతిపక్షాలు కావొచ్చు ప్రశ్నించినప్పుడు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాల్ని ఆశ్రయించినప్పుడు.. వారి వాదనలో నిజముంటే, న్యాయస్థానాలు ప్రజలకు అండగా నిలబడాలి కదా.!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదే పదే తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానాలతో మొట్టికాయలు వేయించుకున్న విషయం విదితమే. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ సర్కార్ న్యాయస్థానాలతో అత్యధికసార్లు మొట్టికాయలు వేయించుకుందంటూ అప్పట్లో తెలంగాణలో విపక్షాలు విమర్శించడం చూశాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అధిగమించేసిందట ఈ మొట్టికాయల విషయంలో. ఆంధ్రప్రదేశ్లోని విపక్షాల వాదన ఇది.
ఉత్త వాదన మాత్రమే కాదు, అందుకు తగ్గ ఆధారాలు మనకి స్పష్టంగా కన్పిస్తున్నాయి కూడా. అమరావతి రైతుల ఆందోళన, పోలీసుల అత్యుత్సాహంపై న్యాయస్థానాలు వేసిన మొట్టికాయల గురించి వింటూనే వున్నాం. మరోపక్క, ఇంగ్లీషు మీడియం విషయంలోనూ అదే పరిస్థితి. పదే పదే ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్నా, ప్రభుత్వం తీరు మారడంలేదని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.
మామూలుగా ఇలాంటి విషయాల్లో సలహాదారులు అత్యంత కీలక భూమిక పోషించాలి. లక్షలకు లక్షలు గౌరవ వేతనాల్ని సలహాదారులకు ప్రభుత్వం చెల్లించేదే అందుకు. కానీ, సలహాదారులు ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వడం లేదన్న విమర్శ గత కొంతకాలంగా చాలా గట్టిగానే విన్పిస్తోంది.
ఈ సలహాదారుల వ్యవస్థ చంద్రబాబుకి ఒకింత సమర్థవంతంగానే పనిచేస్తుంది. అయితే, ఆయన అధికారంలో వున్నప్పుడూ ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పవనుకోండి. ఈ మధ్య సలహాదారులు.. అనగానే, అందులో సలహాలిచ్చే స్థాయి లేనోళ్ళకీ అవకాశాలు దక్కుతున్నాయి. అదే అసలు సమస్య. అందుకే పదే పదే వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయస్థానాల్లో మొట్టికాయలు తినాల్సి వస్తోందట. ఏడాది పూర్తి కాకుండానే ఇన్ని మొట్టికాయలంటే.. ముందు ముందు పరిస్థితి ఇంకెలా వుంటుందో.!