వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందని, పార్టీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను సభలో పాటించడం లేదని, తనకు హోదా ఇవ్వాలని స్పీకర్ ను కోరినా స్పందించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. వెంటనే తనకు ప్రతిపక్ష హోదా కల్పించేలా ఆదేశించాలని హైకోర్టును కోరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను కనీసం 10 శాతం సీట్లు అంటే 18 సీట్లు గెలుచుకున్న పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. వైసీపీ కి 11 సీట్లు మాత్రమే రావడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రజా సమస్యలను బలంగా అసెంబ్లీలో వినిపించేందుకు ప్రతిపక్ష హోదా కావాలని వైసీపీ పట్టుబడుతోంది.