రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీడాప్, ఓంక్యాప్ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించామని, రాబోయే ఐదేళ్లలో 50వేల మందికి విదేశీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
అమరావతిలో జరిగిన కార్యక్రమంలో జర్మనీలో ఉద్యోగాలు సాధించిన 14మంది నర్సింగ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ను లోకేష్ అభినందించారు. తొలి బ్యాచ్లో 171 మందికి శిక్షణ ఇస్తే, ఇప్పటివరకు 40మంది ఉద్యోగాలు పొందారని, త్వరలోనే మిగిలిన వారికి కూడా అవకాశాలు వస్తాయని తెలిపారు. సీడాప్, ఇండో యూరో సింక్రనైజేషన్, జర్మన్ హెల్త్కేర్ భాగస్వామ్యంతో ఈ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అమలవుతోందని వివరించారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ – “అంతర్జాతీయ అవకాశాలు పొందడం యువత లక్ష్యం కావాలి. చంద్రబాబు గారు ముందుచూపుతో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఎఐ, ఎంఎల్, క్వాంటమ్ టెక్నాలజీలపై దృష్టిసారించారు. విదేశీ భాషల్లో శిక్షణతో మన పిల్లలు గ్లోబల్ స్థాయిలో ముందుకు వెళ్ళాలి. 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడం బాబు సూపర్ 6లో ప్రధాన హామీ. ఈ లక్ష్యాన్ని మించి చేరుకోవడానికి మేము కృషి చేస్తున్నాం” అన్నారు.
మహిళా సాధికారిత ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని, అందుకే స్త్రీశక్తి, దీపం-2 వంటి పథకాల ద్వారా మహిళలకు తోడ్పాటు అందిస్తున్నామని లోకేష్ తెలిపారు. విదేశీ భాషల పరీక్షా కేంద్రాలను రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తామని, చదువుతోపాటు జర్మన్, జపనీస్ భాషల్లో శిక్షణ ఇచ్చే చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
జర్మనీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ – “ఇక్కడ 15 నుంచి 20వేలు జీతం వస్తుంది. కానీ సీడాప్ శిక్షణతో అక్కడ నెలకు రూ.2.8 లక్షల జీతంతో ఉద్యోగం రావడం కలలాంటిదే” అని చెప్పారు. ప్రైవేట్ కన్సల్టెన్సీలు భారీ ఫీజు అడిగినా, సీడాప్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా శిక్షణ ఇచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీడాప్ చైర్మన్ గునిపాటి దీపక్ రెడ్డి, ఎపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గణేష్ కుమార్, సలహాదారు సీతా శర్మ, సీఈఓ నారాయణస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
