వరలక్ష్మీ పప్పుల వారి సమర్పణలో, కనకదుర్గారావు పప్పుల నిర్మాణంలో, భాను దర్శకత్వం వహిస్తున్న సినిమా “ప్రేమిస్తున్నా”. ఈ చిత్రంలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది ఒక సరికొత్త ప్రేమకథా చిత్రం.
ఈ మధ్యే విడుదలైన మొదటి పాట “అరెరె” కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ను రాబట్టి మంచి ఆదరణ పొందింది. తాజాగా ఈ సినిమాలోని రెండవ పాట “ఎవరే నువ్వు” ను ప్రముఖ హీరో విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఇది ఆయన విడుదల చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా పాట కావడం విశేషం. సినిమా విజయవంతం కావాలని చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పాటను పూర్ణచంద్ర రాశారు, సంగీతాన్ని సిద్ధార్థ్ సాలూర్ అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ – “విజయ్ సేతుపతి గారు మా సినిమా గురించి తెలుసుకొని పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా కాలం తర్వాత వస్తోన్న అందమైన ప్రేమకథ అని అభిప్రాయపడ్డారు. మా సినిమాపై ఆయన చూపిన అభిమానం మాకు ఉత్సాహాన్ని ఇచ్చింది” అన్నారు.
