ఓ ప్రజా ప్రతినిది¸.. బాధ్యత మరిచి, పబ్లిసిటీ స్టంట్లు చేశాడట.! ఆ పబ్లిసిటీ పైత్యం కారణంగానే చాలామంది అధికారులకు కరోనా వైరస్ సోకిందట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది ఈ వ్యవహారం. ఆఖరికి అధికార పార్టీకి వత్తాసు పలికే ఓ న్యూస్ ఛానల్ (మొన్నటిదాకా అది ఎల్లో ఛానల్.. ఈ మధ్యనే దానికి గులాబీ రంగు.. ఆ తర్వాత వైసీపీ రంగు అంటుకున్నాయ్.. పైగా అదేదో సమాజాన్ని ఉద్ధరించేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేస్తుందనుకోండి.. అది వేరే విషయం), వైసీపీ ఎమ్మెల్యే మీద ‘కరోనా కారకుడు’ అంటూ కథనాన్ని ప్రసారం చేయడం గమనార్హం.
నిజానికి, ఈ వ్యవహారంపై తొలుత నేషనల్ మీడియా స్పందించింది. అంతకన్నా ముందే, ఆంధ్రప్రదేశ్లో న్యూట్రల్ మీడియా సదరు ఎమ్మెల్యేగారి నిర్వాకంపై గళం విప్పితే, అధికార పార్టీ నేతలు నానా యాగీ చేశారు. ఎప్పుడైతే నేషనల్ మీడియా, సదరు వైసీపీ ఎమ్మెల్యే బాగోతాన్ని కడిగి పారేసిందో.. ఇక్కడ, తెలుగు నాట మళ్ళీ ప్రకంపనలు షురూ అయ్యాయి.
‘నేనలాంటోడ్ని కాదు.. సేవా కార్యక్రమం చేద్దామనుకున్నాను.. నా కార్యక్రమం ద్వారా కరోనా ఎవరికైనా సోకిందని తెలిస్తే, నన్ను బహిరంగంగా ఉరి తీయొచ్చు..’ అంటూ సవాల్ విసిరేశారు. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటిదాకా సదరు ప్రాంతంలో కరోనా వైరస్ కేసులు చాలా చాలా తక్కువగా నమోదయ్యాయి. ఎప్పుడైతే, భారీయెత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి, పబ్లిసిటీ స్టంట్లు సదరు ఎమ్మెల్యే చేశారో.. ఆ తర్వాతే పరిస్థితి చెయ్యిదాటింది. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయక్కడ.
కరోనా వైరస్ని వ్యాప్తి చేయాలని సదరు ఎమ్మెల్యే ఈ పనంతా చేశారని అనలేం. కానీ, అధికారమదంతో లాక్డౌన్ని లెక్క చేయకుండా పబ్లిసిటీ స్టంట్లకు తెరలేపిన ఆ ఎమ్మెల్యేపై విచారణ జరగాల్సిందే. ప్రభుత్వోద్యోగులు ఎమ్మెల్యే నిర్వాకంతో కరోనా బారిన పడటమంటే అది క్షమించరాని నేరం. ఈ వ్యవహారాన్ని ఇంకా అధికార పార్టీ సమర్థించుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?