2014 ఎన్నికల్లో పవన్కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిందనీ, ఆ ఎన్నికల్లో బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసింది కాబట్టి, ఇప్పుడు ఆ పార్టీల మధ్య పొత్తులు లేవు గనుక తమకు అన్ని విధాలా ‘క్లియర్ ఎడ్జ్’ వుంటుందని ఈసారి ఎన్నికల్లో ‘ల్యాండ్ స్లైడ్ విక్టరీ’ తమదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా వుంది. అయితే, పోలింగ్ ముగిసి రోజులు గడుస్తున్న కొద్దీ తెరపైకొస్తున్న విశ్లేషణలు ఇప్పుడిప్పుడే అధికార పార్టీతోపాటు ప్రతిఫక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.? అన్న అంశం చుట్టూ కాకుండా, ఆ పార్టీ ఎంత శాతం ఓటు బ్యాంకుని కొల్లగొడుతుంది.? అనే అంశం చుట్టూనే ప్రధానంగా చర్చ జరుగుతోందిప్పుడు. తెలుగుదేశం పార్టీ అంతర్గత సర్వేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలు ఎలా వుంటాయో అందరికీ తెలుసు. ఆయా పార్టీలకు అనుకూలంగానే వుంటాయవి. ఎన్నికల ముందు సర్వేలు మాత్రం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టేశాయి. కానీ, జనసేన ఎఫెక్ట్ని ఎన్నికలకు ముందే ఏ జాతీయ జర్వే కూడా పరిగణనలోకి తీసుకోలేదు.
జనసేనదిగా చెప్పబడుతున్న తాజాగా సోషల్ మీడియాలో ఓ సర్వే ప్రచారంలో వుంది. అది జనసేన మద్దతుదారుల నుంచి పుట్టుకొచ్చిందనే వాదన విన్పిస్తోంది గనుక, అదెలాగూ జనసేనకే అనుకూలంగా వుంటుంది. అంటే, ఏ సర్వేనీ ఇప్పుడు జనం నమ్మే పరిస్థితి లేదన్నమాట. జనం అయితే ఓట్లు వేసేశారు. తీర్పు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో భద్రంగా వుంది. మే 23న మాత్రమే ఈవీఎంలు ఓపెన్ అవుతాయి, అందులో ఆయా పార్టీల బండారం కూడా బయటపడిపోతుంది.
ఇదిలా వుంటే, జనసేన పార్టీకి తొలుత 7 నుంచి 8 శాతం ఓటింగ్ వుండొచ్చని అందరూ భావించారు. పోలింగ్ తర్వాత దాన్ని 10 నుంచి 12 శాతానికి కొందరు పెంచారు. ఇప్పుడైతే ఆ 12 నుంచి 20 శాతానికి పెంచేస్తూ కొందరు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే కొన్ని నియోజకవర్గాల్లో 30 శాతం వరకు జనసేన పార్టీ ఓటు బ్యాంకుని సాధించబోతోందట. అలాంటి నియోజకవర్గాలు 50కి పైనే వున్నాయన్నది ఓ అంచనా.
ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన పార్టీకి కొంత ఎడ్జ్ వుండొచ్చు. అలాగని, జనసేన పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని ఎవరూ విశ్వసించడంలేదు. అదే సమయంలో ఆ పార్టీకి అసలు సీట్లు రావనీ ఎవరూ కుండబద్దలుగొట్టేసే పరిస్థితి లేదు. కర్నూలు జిల్లాలోని మూడు నుంచి ఐదు నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం గట్టిగానే వుండబోతోందట. అది మినహాయిస్తే రాయలసీమలో జనసేన ప్రభావం తక్కువేనని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుని జనసేన చీల్చుతుందని వైసీపీ నమ్ముతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి వెళ్ళకుండా జనసేన ప్రభావం పనిచేస్తుందని, తద్వారా తమకు లాభం చేకూరుతుందని తెలుగుదేశం పార్టీ గట్టి నమ్మకంతో కన్పిస్తోంది. అయితే, తాజాగా వైసీపీ అంతర్గత సర్వేగా చెప్పబడుతున్న ఓ సర్వేలో 60 నుంచి 80 నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా వుంటుందనీ, వీటిల్లో మళ్ళీ సగానికి పైగా స్థానాల్లో వైసీపీకి జనసేనతో కష్టం పొంచి వుందనీ తేలిందంటూ ఓ విశ్లేషణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
టీడీపీ, వైసీపీ ఆలోచనలు, అంచనాలతో తమకు పనిలేదనీ, ఎన్నికల్లో జనసేన ఓటు బ్యాంకుపై తమ పార్టీ ఖచ్చితమైన అభిప్రాయంతో వుందనీ, ఎన్నికల తర్వాత జనసేనాని పార్టీ ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారనీ, ఖచ్చితంగా జనసేన ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అంచనాలకు మించి వుండబోతోందనీ జనసేన చెబుతోన్న దరిమిలా, ఆ పార్టీ వాదన ఏమవుతుందో చూడాలిక.
