ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్నీ.. 25 లోక్ సభ నియోజకవర్గాలకుగాను మొత్తంగా 25 లోక్ సభ నియోజకవర్గాల్నీ గెలిచేసుకుంటామని అధికార వైసీపీ చెబుతోంది.
ఇంకోపక్క తమ ఓటు బ్యాంకు 50 శాతం నుంచి 57 శాతానికి పెరిగిందని వైసీపీ చెప్పుకుంటోంది. వైసీపీ అనుకూల మీడియా ఇదే ప్రచారం గట్టిగా చేస్తోంది. పెయిడ్ మాఫియా కదా, ఇంతకన్నా భిన్నంగా ఎలా వుంటుంది.? అంతిమంగా, ఆ రోజు ఓట్లేసే సమయానికి ఓటర్ల ‘నాడి’ ఎలా వుంటుందన్నదానిపై ఏ రాజకీయ భవిష్యత్తు అయినా ఆధారపడి వుంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి లేకపోయినా, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయన్నది వైసీపీ అనుకూల మీడియానే చెబుతున్నమాట. సంక్షేమ పాలన ఎలా జరగుతోంది.? పెంచుతున్న పన్నులు, చేస్తున్న అప్పులతోనే కదా.? ఈ విషయాన్ని వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదు.
50 శాతం ఓట్లు దక్కించుకుంటే 151 సీట్లు వచ్చినప్పుడు, 57 శాతం ఓట్లు వస్తే 175 సీట్లు రావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, పలు జాతీయ స్థాయి సర్వేలు చెబుతున్న విషయమేంటంటే, వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 18 లోక్ సభ సీట్లు మాత్రమే వస్తాయని. అలా ఎలా.? 25 లోక్ సభ నియోజకవర్గాలకుగాను మొత్తంగా 25 లోక్ సభ సీట్లూ వైసీపీ కైవసం అయిపోవాలి కదా, 57 శాతం ఓటు బ్యాంకు అంటే.?
వైసీపీ ఓటు బ్యాంకు తగ్గి, టీడీపీ ఓటు బ్యాంకు పెరిగిందన్న విషయాన్ని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ జనసేన, బీజేపీ ఓటు బ్యాంకు గురించిన చర్చ చాలా జాతీయ సంస్థల సర్వేల్లో కనిపించడంలేదు. అది కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఖచ్చితంగా వైసీపీకి రానున్న ఎన్నికల్లో చాలా చాలా పెద్ద దెబ్బ తగలబోతోందన్నది నిర్వివాదాంశం.
ఒకే ఒక్క శాతం ఓటు.. రాజకీయాల్ని మార్చేస్తుంది. 18 లోక్ సభ సీట్లకీ 7 లోక్ సభ సీట్లకీ మధ్య ఓటు శాతం తేడా చాలా చాలా తక్కువుగా వుంటుందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఆ లెక్కన, ఎన్నికల నాటికి అరశాతం ఓటు బ్యాంకు అటూ ఇటూ అయినా, తక్కెడ లెక్కలు మారిపోతాయ్.
కానీ, అధికారంలో వున్న పార్టీలు ఎప్పుడూ, కళ్ళకు ‘అధికారం’ అనే గంతలు కట్టుకునే వుంటాయి. ఆ గంతల్ని కట్టేది కూడా అధికార పార్టీ అను‘కుల’ మీడియా సంస్థలే అవుతాయ్. అప్పట్లో టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. అంతే తేడా.! మిగతాదంతా సేమ్ టు సేమ్.!