ఎట్టకేలకు అఖిల్ అక్కినేని కొత్త సినిమాకి హీరోయిన్ దొరికేసింది. పూజా హెగ్దే పేరు గతంలోనే ఖరారైనా, చివరి నిమషం వరకూ సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. దానిక్కారణం లేకపోలేదు, హీరోయిన్ ఎంపిక విషయమై అఖిల్ ఓ స్పష్టతతో లేడు ఇప్పటిదాకా. తన ప్రతి సినిమా విషయంలోనూ అఖిల్ ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్నాడు. ఈసారి సమస్య హీరోయిన్ రూపంలో వచ్చింది. కైరా అద్వానీ కోసం ఎదురుచూశారుగానీ, ఆమె ‘నో’ చెప్పేసింది. ఆ తర్వాత చాలామంది హీరోయిన్లను ట్రై చేశారు. ‘ఆప్షన్’గా పూజా హెగ్దేని మొదటే పెట్టుకున్నారు.
ఈలోపు, పూజా హెగ్దే రెమ్యునరేషన్ని అనూహ్యంగా పెంచేసింది. కానీ, తప్పలేదు. కెరీర్లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ని పూజా హెగ్దే ఇప్పుడు అందుకుంటోందట అఖిల్ కొత్త సినిమాతో. ఆమెకి ఇప్పుడున్న డిమాండ్ అలాంటిది. అల్లు అర్జున్తో ‘అల వైకుంఠపురం’ సినిమా చేస్తన్న పూజా హెగ్దే, ప్రభాస్తో ఓ సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. మరోపక్క, నెక్స్ట్ ఫ్రైడే విడుదలవుతున్న ‘వాల్మీకి’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది పూజా హెగ్దే.
‘అరవింద సమేత’, ‘మహర్షి’ సినిమాల తర్వాత పూజా హెగ్దే జోరు పెరిగిందని చెప్పడం కంటే, టాలీవుడ్లో హీరోయిన్ల కొరత కారణంగా ఆమె రేంజ్ పెరిగిందనడం సబబేమో. ఇక, అఖిల్ కొత్త సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కానీ, కొన్ని కారణాలతో సినిమా షూటింగ్ కాస్త హోల్డ్లోకి వెళ్ళింది. ఇప్పుడిక పూజా హెగ్దే జాయిన్ అవుతుండడంతో సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్లో జరుగుతుందని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్ఫణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తోన్న విషయం విదితమే.
