కాపు సామాజిక వర్గం అంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట వెళుతుందని అధికార వైసీపీ భయపడుతోంది. ఆ విషయం కాపు మంత్రుల మాటలతోనే స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ విషయమై చాలా చాలా ఆందోళన చెందుతున్నారు.
‘కాపుల ఓట్లను టీడీపీకి వేయించాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు..’ అంటూ వైసీపీ అధినేత తాను వ్యాఖ్యానించడమే కాకుండా, వైసీపీకి చెందిన కాపు ముఖ్య నేతలతోనూ అవే వ్యాఖ్యలు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో వుండి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలా కులాల పంచాయితీని తెరపైకి తీసుకురావడం ఎంతవరకు సబబు.?
పవన్ కళ్యాణ్ మాత్రం కాపుల గురించి ప్రస్తావించకూడదు, అలా ప్రస్తావిస్తే.. ఆయనకు కులగజ్జి వున్నట్లు. వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి సహా.. కాపుల ప్రస్తావన తీసుకు రావొచ్చు, కాపుల పేరుతో రాజకీయాలు చేయొచ్చు.. అదే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా, దానికి ‘కులాన్ని’ ఆపాదించేస్తుంటారు.
‘పవన్ కళ్యాణ్తో కాపులు జాగ్రత్తగా వుండాలి..’ అంటూ వైసీపీ కాపు సామాజిక వర్గాన్ని హెచ్చరిస్తోంది. ఔను, పవన్ కళ్యాణ్ గనుక ముఖ్యమంత్రి అయితే, కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. అలా దక్కకూడదు కాబట్టి, ఈ విషయంలో కాపు సామాజిక వర్గం అప్రమత్తంగా వుండాలంటూ కాపు సామాజిక వర్గానికే చెందిన వైసీపీ నేతలు చెప్పదలచుకుంటున్నట్టుంది.
కమ్మ సామాజిక వర్గం నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వొచ్చు.. కమ్మ సామాజిక వర్గమంతా చంద్రబాబు వెంట నడవొచ్చు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అవ్వొచ్చు.. రెడ్డి సామాజిక వర్గం అంతా ఆయన వెంట నడవొచ్చు.. కానీ, కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవకూడదు. కాపులెవరూ పవన్ కళ్యాణ్ వెంట నడవకూడదు.!
కాపు సామాజిక వర్గం ఇక్కడే ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాపు సామాజిక వర్గంలో ఎందుకు చీలిక వస్తోందన్నదానిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది ఆ సామాజిక వర్గానికి చెందినవారే.