‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి, రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ఢిల్లీకి వెళ్ళి, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిస్తే.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు చీవాట్లు పెట్టారని బాధ్యతారాహిత్యంతో కథనాలు వండి వడ్డిస్తారా.? అసలు అలాంటి పరిస్థితి వుంటుందా.? ఏ కేంద్ర ప్రభుత్వం తరఫున అయినా ఢిల్లీ పాలకులు, రాష్ట్ర పాలకుల్ని ఉద్దేశించి చీవాట్లు పెడతారా.? ఇదెక్కడి రాజకీయం.?’ అంటూ ఎల్లో మీడియా కథనాలపై వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి (సలహాదారు) తెగ గుస్సా అయిపోయారు.
నిజమే.. ప్రధాని కావొచ్చు, ఇతర కేంద్ర మంత్రులు కావొచ్చు.. ముఖ్యమంత్రికి చీవాట్లు పెట్టే పరిస్థితే వుండదు. అది వైఎస్ జగన్ విషయంలో అయినా, చంద్రబాబు విషయంలో అయినా, ఇంకెవరి విషయంలో అయినా ఒకేలా వుంటంది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ‘బ్లూ మీడియా కథనాలు’ ఒక్కసారి చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డికి తాను చెప్పిన నీతుల్లో ఎంత చిత్తశుద్ధి వుందో అర్థమయిపోతుంది.
కేంద్రం – రాష్ట్రం అనే స్థాయిలో చీవాట్లు వుండకపోవచ్చు.. ఢిల్లీ పర్యటనల్లో.. ఇతరత్రా రాజకీయ పరమైన సమావేశాలూ వుంటాయి. వాటిల్లో మాత్రం, ఆక్షేపణలు ఖచ్చితంగా వుండేందుకు అవకాశముంటుంది. ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, హిందూ మతంపై పలువురు వైసీపీ నేతలు చేస్తోన్న అడ్డగోలు వ్యాఖ్యలు.. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళి తీరతాయి. బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేశారు.
ఢిల్లీలో జగన్ టూర్ సందర్భంగా అమిత్ షా ఏం మాట్లాడారోగానీ, సజ్జల రామకృష్ణారెడ్డి తమ మంత్రి కొడాలి నానికి సుద్దులు చెప్పారు ప్రధానిపై మంత్రిగారి జుగుప్సాకర వ్యాఖ్యల నేపథ్యంలో. ఇదొక్కటి చాలు.. వైసీపీ ముఖ్య నేతలకు ఢిల్లీలో అక్షింతలు పడ్డాయని చెప్పడానికి. ‘అబ్బే, ఆ పరిస్థితే వుండదు..’ అని సజ్జల బుకాయింపుల్లో అసలు విషయం ఇలా తేటతెల్లమైపోయాక.. వైసీపీ శ్రేణులు నిర్ఘాంతపోకుండా వుంటాయా.?