ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని, ఎవరైనా తమ పార్టీలోకి రావాలని భావిస్తే.. వారు తమ అన్ని పదవులకూ రాజీనామా చేయాల్సిందేనని, అప్పుడే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే అదే సిద్ధాంతానికి ఆయన కట్టుబడి ముందుకెళ్తున్నారు. వైసీపీలో చేరాలని భావించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా అదే షరతు విధించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు గండి కొట్టే వ్యూహంతో ముందుకు కదులుతున్న అధికార పార్టీ నేతలు.. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు గాలమేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఖాయమనే ప్రచారం ముమ్మరమైంది.
అయితే, తమ పార్టీ సిద్ధాంతమైన ‘రాజీనామా’ అనే అంశమే ఇక్కడ ప్రధాన అడ్డంకిగా మారుతోందని అంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావడానికి ఎక్కువ మంది అంగీకరించడంలేదని సమాచారం. ఎన్నికల్లో ఎంతో ఖర్చు పెట్టి గెలిచామని, ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలవడం కష్టమేనని అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.
రాజీనామా నిబంధన పక్కన పెడితే పార్టీలో చేరడానికి తాము సిద్ధమేనని చెబుతున్నారు. విశాఖ నార్త ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర ఎమ్మెల్యేలు సైతం రాజీనామా నిబంధన కారణంగానే వైసీపీని కాదని బీజేపీలో చేరడానికే మొగ్గు చూపించారనే టాక్ వినిపిస్తోంది. జగన్ ఆ విషయంలో కాస్త సడలింపు ఇస్తే టీడీపీ ఖాళీ కావడానికి ఎంతో సమయం పట్టదని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం తమతో టచ్ లో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఇదే విషయంలో తర్జనభర్జన పడుతున్నారని తెలుస్తోంది. ఈ అంశంలో జగన్ లైన్ క్లియర్ చేస్తే వెంటనే పార్టీ మారిపోతామని వారు చెబుతున్నట్టు సమాచారం. అయితే, జగన్ ఒక విధానాన్ని గట్టిగా అనుకుంటే దాని నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఏమవుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.