రైలు పట్టాలపై నడిచి వెళ్ళడం నేరం. కానీ, లాక్డౌన్ నేపథ్యంలో సొంతూళ్ళకు వెళ్ళాలంటే అదొక్కటే మార్గం. ఏ క్షణాన రైలు తమ మీదకు దూసుకొస్తుందోనన్న భయం ఓ పక్క వున్నా, లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక, ఆకలి చావులకు భయపడి, సొంతూళ్ళకు వెళుతున్న చాలామంది ఆ రైలు పట్టాల్నే ఎంచుకుంటున్నారు తమ ప్రయాణ మార్గాలుగా. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితిని చూస్తున్నాం.
కానీ ఔరంగాబాద్లో ఓ రైలు 15 మంది అభాగ్యుల ప్రాణాల్ని బలిగొంది. రైలు డ్రైవర్ (లోకో పైలట్) అప్రమత్తంగా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమన్న వాదనను రైల్వే శాఖ కొట్టి పారేసింది. రైలు డ్రైవర్, పట్టాలపై జనాల్ని గుర్తించినప్పటికీ, రైలుని అదుపు చేయడం సాధ్యం కాలేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రధాని ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నిన్న విశాఖలో గ్యాస్ లీక్.. ఈ రోజు రైలు పట్టాలపై ఆవిరైపోయిన ప్రాణాలు.. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం మామూలే. కానీ, నేరం ఎవరిది.? లాక్డౌన్ నేపథ్యంలో సొంతూళ్ళకు వెళ్ళేందుకు అభాగ్యులకు అనుమతినివ్వని ప్రభుత్వాల్నే ఇక్కడ తప్పుపట్టాల్సి వుంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, కూలీలను ఆదుకోవడంలో విఫలమవడంతోనే ఈ దుస్థితి దాపురించింది.
ఇదొక్కటే కాదు.. వందల కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళుతున్నారు చాలామంది. నిండు గర్భిణి.. బాలింత.. ఇలా ఒకరేమిటి.? రోడ్లపై, రైలు పట్టాలపై అభాగ్యులు ఎందరో కన్పిస్తున్నారు. మనిషిలో మానవత్వం ఇంకా చచ్చిపోలేదు. అందుకే, సాటి మనిషిని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. సొంతూళ్ళకు పయనమైనవారికి మార్గమద్యంలో ఆహారాన్ని అందిస్తున్నారు. మరి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.? ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు.
కోట్లు ఖర్చు చేశామని చెప్పుకోవడం తప్ప, ప్రభుత్వాల సాయం చివరి వ్యక్తి వరకూ చేరకపోవడంతోనే ఈ దుస్థితి. లాక్డౌన్ ప్రకటించేశాం.. మీ చావు మీరు ఛావండి.. అని కేంద్రం వ్యహరించబట్టే ఈ దుస్థితి.. అంఉటన్న విపక్షాల విమర్శల్ని తేలిగ్గా ఎలా కొట్టి పారేయగలం.?