జనసేన ముఖ్య నేత కొణిదెల నాగబాబు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. శాసన మండలి ఛైర్మన్ సమక్షంలో నేడు, నాగబాబు ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణం చేశారు. అంటే, నేటి నుంచి ‘ఎమ్మెల్సీ’ నాగబాబు.. అనే అధికారిక గుర్తింపు (ప్రోటోకాల్) నాగబాబుకి దక్కిందన్నమాట.
తర్వాతేంటి.? ఇంకేముంది, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేస్తే, అప్పుడు నాగబాబు మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడమే. నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు గతంలోనే నిర్ణయం తీసుకున్నారు.
మామూలుగా అయితే, మంత్రి అవడానికి ముందుగా ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో అవ్వాల్సిన పని కూడా లేదు. మంత్రి అయిన తర్వాత, ఆరు నెలలోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అవ్వాల్సి వుంటుంది ఎవరైనా.
కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం, ఎమ్మెల్సీ అయ్యాకనే నాగబాబుని మంత్రిగా చూడాలనుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు, ఎమ్మెల్సీ అయ్యేవరకు నాగబాబుకి మంత్రి పదవిని చంద్రబాబు వాయిదా వేశారు.
ఇదిలా వుంటే, ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణం చేశాక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిశారు నాగబాబు. సతీ సమేతంగా నాగబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవగా, నాగబాబుకి శాలువా కప్పి విషెస్ అందించారు చంద్రబాబు.
నాగబాబు విషయమై టీడీపీలో కొందరికి కొన్ని అభ్యంతరాలున్నమాట వాస్తవం. గతంలో చంద్రబాబు మీద విమర్శలు చేశారనో, బాలయ్యను తూలనాడారనో.. తెలుగు తమ్ముళ్ళకి చిన్న కోపమైతే వుంది. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. టీడీపీ నుంచీ పవన్ కళ్యాణ్ మీద గతంలో విమర్శలు చూశాం. అది గతం.
ఇక, ఇక్కడితో ఆ వివాదాలన్నీ సద్దుమణిగిపోతాయనే అనుకోవాలి.
