కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. మిగిలినవాటితో పోలిస్తే ఈ రంగానికి వచ్చిన నష్టం చాలా ఎక్కువ. పైగా కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. కరోనా భయం నేపథ్యంలో మునుపటిలా జనాలు థియేటర్లకు వస్తారా అనే సందేహం అటు నిర్మాతల నుంచి ఇటు థియేటర్ యజమానుల వరకు అందరిలో నెలకొంది. ఇప్పటికే సినిమాలు, షూటింగులు నిలిపేసి నెలరోజులు దాటేసింది.
దీంతో ఈ రంగంపై ఆధారపడిన చాలామంది ఉపాధి కోల్పోయినట్టయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1600 థియేటర్లు ఉన్నాయి. ఇందులో 800 వరకు మల్టీప్లెక్స్ లే. ఒక్కో థియేటర్ కు నెలకు సగటున రూ.3 లక్షల అద్దె ఉండగా.. కార్మికుల జీతాలకు రూ.లక్షన్నర వరకు వెచ్చిస్తారు. నెలరోజులుగా సినిమాలు వేయకపోవడంతో ఈ మేరకు కార్మికులు తమ ఆదాయం కోల్పోయారు.
మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ, సినిమా హాళ్లకు వెంటనే అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఒకవేళ ఏ జూన్ కో అనుమతి వచ్చినా.. మునుపటిలా జనం థియేటర్లకు వస్తారా అన్నది సందేహమే. సినిమాలకు సమ్మర్ సీజన్ చాలా కీలకం. కానీ కరోనా కారణంగా ఈ సమ్మర్ సీజన్ మొత్తం వృథా అయిపోయింది. దీంతో పలు చిన్న సినిమాలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి.
పూర్తిస్థాయిలో థియేటర్లు ప్రారంభమైన తర్వాత కూడా జనం సినిమాలు చూడటానికి భయపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏం చేయాలా అని పరిశ్రమకు చెందిన పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. చైనా తరహాలో థియేటర్ సామర్థ్యంలో సగం టికెట్లు మాత్రమే అమ్మాలని యోచిస్తున్నారు. అంటే.. సీటుకి, సీటుకి మధ్య ఒకటి రెండు సీట్లు ఖాళీ ఉంచాలన్నది దీని ఉద్దేశం.
అదే సమయంలో టికెట్ రేట్లు కూడా తగ్గించాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. తద్వారా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ సినిమాలో చూసిన కష్టాలు ఇప్పుడు సినిమారంగాన్ని చుట్టుముట్టాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
398262 414189Fantastic article mate, maintain the fantastic function, just shared this with ma friendz 715859