కొత్త ప్రభుత్వానికి ఆర్నెళ్ళు సమయం ఇస్తాం.. కాదు కాదు, ఏడాది సమయం ఇస్తాం.. అని ఓడిన రాజకీయ పార్టీలు, గెలిచిన రాజకీయ పార్టీల గురించి చెబుతుండడం చూస్తుంటాం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి, ఏడాది పూర్తయ్యింది. అంతకు ముందు 151 సీట్లతో అధికార పీఠమ్మీదున్న వైసీపీ, పదకొండు సీట్లకు పడిపోయింది 2024 ఎన్నికలొచ్చేసరికి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికార పీఠమెక్కింది.
గడచిన ఏడాది కాంలో, అసెంబ్లీకి వెళ్ళడానికి పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయపడ్డారు. కానీ, ప్రతిపక్ష హోదా తనకు కావాలంటూ, నానా యాగీ చేశారు. ప్రతిపక్ష హోదా కావాలంటే, ప్రజల్లో వుండాలి.. కానీ, వున్నారా మరి.? లేరు, ఆంధ్ర ప్రదేశ్లో కంటే, బెంగళూరులో ఎక్కువగా వుంటున్నారాయన.
పోనీ, సొంత నియోజకవర్గం పులివెందులలో అయినా, ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో వుండి, తనను గెలిపించిన ప్రజలెదుర్కొంటున్న ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి.. అదీ, చేయట్లేదు. కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతి పక్ష హోదా కావాలి.
వైఎస్ జగన్ మాటల్లో చెప్పాలంటే, ‘కళ్ళు మూసుకుంటే, ఏడాది గడిచిపోయింది’. మరో నాలుగేళ్ళు వైఎస్ జగన్, ఇలాగే కళ్ళు మూసుకుంటారా.? అబ్బే, అప్పుడప్పుడూ బెంగళూరు – గన్నవరం విమానాశ్రయాల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. వారానికి ఓ రెండు మూడు రోజులు, తాడేపల్లి ప్యాలెస్లో సేద తీరి, ఆ తర్వాత బెంగళూరులో సేద తీరడానికి వెళ్ళిపోతున్నారాయె.
మొన్నటికి మొన్న ‘వెన్నుపోటు దినం’ అని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. పోనీ, ఆ ‘దినం’లో అయినా పాల్గొన్నారా.? అంటే, అదీ లేదు. గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లను పోలీసులు కొడితే, తన్నులు తిన్న రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఈ మధ్యనే వచ్చారు వైఎస్ జగన్. ఇదీ వైఎస్ జగన్ రాజకీయం.
వీకెండ్ పొలిటీషియన్ అని కూడా అనలేం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని. ఆయన చేస్తున్నది అసలు రాజకీయమే కాదు. ఇది ఇంకోటేదో.! రౌడీ షీటర్ల పరామర్శ యాత్ర.. అనుకోవచ్చేమో.! ఏతావాతా చెప్పేదేంటంటే, గడచిన ఏడాది కాలంలో వైఎస్ జగన్, ప్రజల్ని ప్రసన్నం చేసుకున్నదేమీ లేదు. వైసీపీ గ్రాఫ్ మరింత పతనమైంది తప్ప, వైసీపీకి ఒరిగిందేమీ లేదు జగన్ వల్ల.. గడచిన ఏడాదిలో.
