ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఇటీవల సైనస్ సమస్య నేపథ్యంలో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నప్పటినుంచీ వున్న సమస్యే అయినా, రాజకీయాల్లోకి వచ్చాక, ఆ సమస్య తీవ్రమైంది.
క్షణం తీరిక లేని పొలిటికల్ షెడ్యూల్స్ నేపథ్యంలో, సర్జరీని వాయిదా వేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. కానీ, ఇటీవల సమస్య మరింత తీవ్రమవడంతో సర్జరీ చేయించుకోక తప్పలేదు. పవన్ కళ్యాణ్కి జరిగిన సర్జరీ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోడీ, అదే రోజు ఫోన్లో పరామర్శించారు.
తాజాగా, హైద్రాబాద్ పర్యటన సందర్భంగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఆరోగ్యంపై తగు జాగ్రత్తలూ సూచించారు నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్కి. పెద్దన్న లాంటి నరేంద్ర మోడీ, తన ఇంటికి రావడం పట్ల పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు.
అయితే, పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని వెళ్ళబోతున్నారన్న ప్రచారం నాలుగైదు రోజులుగా జరుగుతున్న దరిమిలా, ఈ విషయమ్మీదా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులు విపరీతమైన దుష్ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ వెళ్ళడంలేదనీ తేల్చారు.
కానీ, పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోడీ వెళ్ళారు, పలు అంశాలపై పవన్ కళ్యాణ్తో చర్చారు. కుటుంబ సభ్యుల్ని పేరు పేరునా పలకరించి, వారితో ముచ్చటించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్తో ప్రధాని మోడీ రాజకీయ అంశాలపైనా చర్చించారనే ప్రచారం జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ని పొలిటికల్ పవర్ స్టార్ అనీ, ఆంధీ అనీ.. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో బీజేపీ – జనసేన బంధం మరింత బలపడాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తున్నారు. ఇదే విషయమై ఇరువురి మధ్యా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
వేగంగా కోలుకుని, రాజకీయాల్లో మరింత యాక్టివ్ అవ్వాలని పవన్ కళ్యాణ్కి ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్లు తెలుస్తోంది. ‘కేవలం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమవ్వొద్దు..’ అని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్కి స్పష్టంగా చెప్పారట.
పూర్తిగా కోలుకున్నాక, ఢిల్లీకి వస్తే.. మరింత లోతైన చర్చ ఈ విషయమై జరపాల్సి వుందని పవన్ కళ్యాణ్తో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారని తెలుస్తోంది. వచ్చే నెలలో, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళే అవకాశం వుంది.
