ఏపీని ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోంది. రాష్ట్రాన్ని ఐటీ క్యాపిటల్గా తీర్చిదిద్దాలన్న దిశగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశేషంగా శ్రమిస్తున్నారు. గుజరాత్ తరహాలో ఇక్కడ కూడా కంపెనీలకు భూమిని తక్కువ ధరకే ఇవ్వాలని నిర్ణయించారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు టాప్ కంపెనీలకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. వారిలో ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీలు పెట్టుబడులకు ముందుకొస్తే 99 పైసలకే ఎకరా భూమిని ఇవ్వనున్నట్టు లోకేష్ ప్రకటించారు.
ఈ విధానం ఇప్పటికే ఫలితాలు ఇస్తోంది. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఏపీకి రావడానికి రెడీ అవుతున్నాయి. ప్రముఖ సంస్థ కాగ్నిజెంట్కు రూపాయికే భూమిని కేటాయించారు. వీరు విశాఖలో రూ. 1,582 కోట్ల పెట్టుబడితో క్యాంపస్ ఏర్పాటు చేసి 8,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. అలాగే టీసీఎస్కు 99 పైసలకే భూమి ఇచ్చి, వారు రూ. 1,370 కోట్లతో క్యాంపస్ వేసి 12,000 ఉద్యోగాలు కల్పించనున్నారు.
ఇదే సమయంలో వైసీపీ చెప్పిన మూడు రాజధానుల ప్రణాళికపై లోకేష్ స్పందించారు. ప్రజలు స్పష్టంగా ఆ ప్రణాళికను తిరస్కరించారని, అందుకే విశాఖలో వైసీపీ ఒక్కసీటు కూడా గెలవలేదన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, విశాఖలో ఐటీ రంగంతో పాటు రసాయన పరిశ్రమలు, కొత్త ఎయిర్ పోర్టు, పెద్ద ఎత్తున ఉక్కు కర్మాగారాల ఏర్పాటు కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఇప్పటికే 100కి పైగా సాఫ్ట్వేర్ కంపెనీలు వైజాగ్ తీరాన వచ్చాయి. ఇంకా పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయట. ఇదే వేగం కొనసాగితే, త్వరలో వైజాగ్ దేశ ఐటీ మ్యాప్లో ప్రత్యేక స్థానం సంపాదించటం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
