ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? ఉత్తరాంధ్రలో ప్రధాన నగరమైన విశాఖపట్నంకు రాజధాని హోదా దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతోనే ఈ అదృష్టం విశాఖకు దక్కాల్సింది. నిజానికి ఇది అదృష్టం కాదు.. అంతకు మించిన అవకాశం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి లేనే లేదు. కానీ, కొన్ని రాజకీయ శక్తులు విశాఖ అభివృద్ధికి మొదటి నుంచీ అడ్డు తగులుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైద్రాబాద్ తర్వాత కేంద్ర సంస్థలు ఎక్కువగా వున్నది విశాఖపట్నంలోనే.
అభివృద్ధి చెందిన నగరం హైద్రాబాద్ తర్వాత ఏదంటే, విశాఖపట్నమే కన్పిస్తుంది. కారణాలేవైతేనేం, విశాఖను ఇప్పటిదాకా తొక్కేశాయి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కూడా. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించినాసరే.. ఆ గౌరవాన్ని దక్కించుకోవడానికి పూర్తి అర్హతలనున్న నగరమది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్ని ఉత్తరాంధ్రగా పరిగణిస్తాం. ఆ మాటకొస్తే, తూర్పుగోదావరి జిల్లాలోనూ చాలా ప్రాంతం విశాఖపట్నంతో కొంతమేర కనెక్ట్ అయి వుంటుంది. అలా ఆ నాలుగు జిల్లాలకీ విశాఖ మొదటి నుంచీ పెద్ద దిక్కుగా వుంటూ వస్తోంది. ఇప్పుడు ఈ నగరానికి రాజధాని హోదా దక్కడంతో, ఆ నాలుగు జిల్లాల ప్రజానీకం పూర్తిస్థాయిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కానీ, ‘మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు..’ అనే నినాదం, ఉత్తరాంధ్ర ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ‘విశాఖకు అన్ని అర్హతలూ వున్నా, విశాఖను కాదని అమరావతిని రాజధానిగా చేస్తే.. మేం అభ్యంతరం పెట్టలేకపోయాం. ఇప్పుడు విశాఖకు అదృష్టం కలిసొచ్చింది.. దాన్ని తన్నుకుపోవద్దు..’ అని ఉత్తరాంధ్ర ప్రజానీకం నినదిస్తోంది. విపక్షాలకు ఇది మింగుడుపడని విషయమే.
అదే సమయంలో, విశాఖలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరపాలనీ, దాంతోపాటుగా విశాఖకు హైకోర్టు బెంచ్ రావాలనీ ఉత్తరాంధ్ర ప్రజానీకం డిమాండ్ చేస్తుండడం.. అధికార పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు. రాయలసీమ వాసులేమో, కర్నూలులో హైకోర్టుతోపాటు, మినీ సచివాలయాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్తరాంధ్రకు ఆశ చూపి, రాజధాని వ్యవహారాలకు సంబంధించి ‘కోత’ విధించక తప్పదా.? ‘విశాఖ ఉసురు తీస్తామంటే రాజకీయంగా ఊచకోత తప్పదు..’ అని ఉత్తరాంధ్ర నుంచి వెల్లువెత్తుతున్న హెచ్చరికలు, అధికార పార్టీకి తలనొప్పులు తెచ్చి పెట్టడం ఖాయమేనా.? వేచి చూడాల్సిందే.
204135 148602You Lastly want the respect off your family and friends? 321392