Viral Video: మొబైల్ చేతిలో లేకపోతే ప్రపంచం ఆగిపోయిందా అనేట్టు ఉంటున్నాయి పరిస్థితులు. రోజువారీ పనుల్లో మొబైల్ కీలకంగా మారింది. పిల్లలు బాల్యంలో ఆడుకోవాల్సిన ఆటలు కూడా ఫోన్లోనే. ఇదే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో 11ఏళ్ల బాలుడిపాలిట శాపంగా మారి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే..
మెరినా జిల్లాలో కొందరు పిల్లలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేందుకు ప్రాంక్ రీల్ చిత్రీకరిస్తున్నారు. ఏడో తరగతి చదువుతున్న కరణ్ పర్మార్ అనే బాలుడు ఇంటి వద్దే తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఇందులో భాగంగా బాలుడి మెడకు తాడు బిగించగా అతడు బాధను నటించాలి.
అయితే.. ఉరితాడు మెడకు బిగుసుకుపోయి బాలుడు ఊపిరాడక విలవిలలాడిపోయాడు. అది నటనే అనుకుని తోటి పిల్లలు అల్లరి చేస్తూ వీడియో చిత్రీకరిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో బాలుడు అచేతనుడైపోవడం చూసి కంగారుపడ్డారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.