విజయవాడ నగరంపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరద బీభత్సం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు. సిటీ, శివారు ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. ప్రాణ నష్టం లేనప్పటికీ.. నివాసాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇళ్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీట మునిగాయి. భారీ స్థాయిలో వాహనాలు దెబ్బతిన్నాయి. వర్షం తగ్గటంతో నగరంలోని ఎగువ ప్రాంతాలు కొద్దికొద్దిగా కోలుకుంటున్నాయి. భూగర్భ డ్రైనేజీ వరద నీటితో కలిసి పోవడంతో తాగునీరు కలుషితమైంది. కృష్ణానదికి వచ్చే వరద తగ్గితే తప్ప లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఇప్పుడప్పుడే మెరుగుపడేలా లేదు.
అసలేం జరిగిందంటే..
శని, ఆదివారాల్లో రికార్డ్ స్థాయిలో వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వాగులు, వంకలు పొంగి, తెలంగాణలో పలు చెరువులు తెగిపోవడంతో విజయవాడ ను వరద ముంచెత్తింది. ఫలితంగా బుడమేరు మెయిన్ డ్రెయిన్ పొంగిపొర్లడంతో తీవ్ర నష్టం సంభవించింది. బుడమేరు ప్రవాహ సామర్ధ్యం 10000 క్యూసెక్కులు మాత్రమే. దానిని ఆధునికీకరణ చేసి దాని సామర్థ్యం 17,500 క్యూసెక్కులకు పెంచారు. భారీ వర్షాలకు ఒక్కసారిగా బుడమేరుకు 45 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. విజయవాడ సమీపాన ఉన్న తెలంగాణలోని దాదాపు 30 చెరువులకు గండ్లు పడ్డాయి. దానిపై అక్కడి అధికారులకు సమాచారం అందలేదు. అయితే ఇంతటి ప్రమాద తీవ్రతను ఏపీ అధికారులు ముందస్తు అంచనా వేయలేకపోయారు. ఫలితంగా ప్రజలను అప్రమత్తం చేసి సమయం లేకుండా పోయింది. లక్షల మంది నిర్వాసితులయ్యారు. రూ. వందల కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది.
కృష్ణా బ్యారేజీకి మరింత వరద చేరే అవకాశం..
మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో కృష్ణానదికి వరద చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాజెక్టులన్ని వరదనీటితో నిండిపోయాయి. దీంతో దిగువన ఉన్న నీటి ప్రాజెక్టులకు వరద నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లో ఎక్కువ స్థాయిలో వరద నీరు వదులుతుండటంతో సోమవారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ కి 11.34 లక్షల క్యూసెక్కుల వరద చేరింది. అంతే స్థాయిలో నీటిని దిగువకు వదిలారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో మరో అల్పపీడనం ఉండటంతో కృష్ణానదికి వరద ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
విజయవాడ-హైదరాబాద్ హైవే పై రాకపోకల పునరుద్ధరణ
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద ఉన్న మున్నేరు వాగుకు వరద తగ్గటంతో సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతినిచ్చారు. అంతకుముందు మున్నేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో హైవేపై భారీ స్థాయిలో వరద నీరు చేరింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం వరకు హైవేపై రాకపోకలను అధికారులు నిషేధించారు. సోమవారానికి వరద తగ్గుముఖం పట్టడంతో రాకపోకలకు అనుమతినిచ్చారు. దాదాపు 30 గంటల పాటు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మరోవైపు గరికపాడు పాలేటి వంతెన వద్ద తెగిపోయిన జాతీయ రహదారిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు పక్కనే ఉన్న ఎడమ వంతెనను ప్రయాణికులు రాకపోకలకు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు
