విజయసాయిరెడ్డి…ఈపేరు తెలియని వాళ్లు ఇప్పుడు ఏపీలో ఎవరూ లేరు.. లాబీయింగులోనూ, రాజకీయానికి తనదైన కలరింగ్ ఇవ్వటంలోనూ సిద్దహస్తుడని హస్తినలో ఆయనకు బాగా పేరు. ఇక ముఖ్యమంత్రి జగన్ కు నమ్మకస్థుడిగా, కష్టాల్లో ఆయనకు అండగా నిలబడ్డ వ్యక్తిగా వైసీపీలో సైతం ఆయనకు టాప్ ప్రయారిటీనే. సీబీఐ కేసుల్లోనే కాదు, పార్టీలో కూడా నెంబర్ టూ స్థానం ఎవరిదంటే అనుమానం లేకుండా ముందుగా గుర్తొచ్చే పేరు సాయిరెడ్డిదే..ఆయన ఫోన్ వచ్చిందంటే కూర్చుని మాట్లాడే మంత్రులుండరు, ఆయన నుండి కబురు వచ్చిందంటే అలర్ట్ అవ్వని ఎమ్మెల్యేలుండరు..ఎందుకంటే సాయిరెడ్డి అంటే జగన్…జగన్ అంటే సాయిరెడ్డి.
ఇదంతా నిన్నా మొన్నటివరకూ కనిపించిన సీన్..కానీ ఇప్పుడు ఆయన సీటుకిందకు నీళ్లొచ్చాయని తాడేపల్లి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన ప్రయారిటీని సదరు సాయిరెడ్డి దుర్వినియోగం చేశారన్నది అక్కడి టాక్. పరిస్థితులు, పరిధులు దాటి పోవటమే ఇప్పుడు సాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గిపోవటానికి కారణాలన్నది వైసీపీలో ఆయనంటే అసూయపడే వర్గం చెప్పేమాట. కష్టాల్లో ఉన్నపుడు వెంట ఉన్నాడని విలువనిస్తే ఇప్పుడు సాయిరెడ్డి వ్యవహారం ప్రభుత్వానికి అదనపు కష్టాలు తెచ్చిపెడుతోందన్నది వారి మాటల సారాంశం. అసలే జగన్ చుట్టూ ఉన్న ఓ కోటరీ ఆయన్ని పక్కదారిపట్టిస్తోందనీ, ముగ్గురు నలుగురు సీనియర్ రెడ్డీస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని కూడా అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
సరే…వీటిలో నిజమెంతన్నది పక్కనబెడితే రెండురోజులుగా రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు అటూ ఇటూ వెళ్లి సాయిరెడ్డి దగ్గరే ఆగిపోతున్నాయి. మొన్న వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ ప్రమాదం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ఇంచుమించు జగన్ సాయిరెడ్డిని తన కారునుండి దించేసిన దృశ్యాలు కూడా అంతే చర్చకు తెరదీశాయి. ఇది జరిగిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. ఇదేంట్రా బాబూ, మధ్యలో నన్ను టార్గెట్ చేశారనుకుని సాయిరెడ్డి చెప్పారో లేక ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయో కానీ మంత్రి ఆళ్లనాని సాయిరెడ్డి కారు నుండి దిగిన ఘటనపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. పార్టీలో ఆయన ప్రాధాన్యత అసామాన్యం, అనిర్వచనీయమని కూడా సదరు మంత్రి ముక్తాయింపునిచ్చారు. అయితే ముఖ్యమంత్రితో సాయిరెడ్డి వైజాగ్ కు వెళ్లకపోవటమే కాదు, ఆ తర్వాత కూడా సాయిరెడ్డి కేంద్రంగానే వైసీపీపై విమర్శల జడివాన కురుస్తోంది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి సాయిరెడ్డి ట్రస్టుకు భారీ విరాళాలు వచ్చాయనీ, ఆ కంపెనీ వ్యవహారాల్లో పార్టీ అధికారం వచ్చినప్పటి నుండే ఆయన తలదూర్చుతున్నారన్నది విపక్షాల విమర్శలు.
దీంతో వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ముఖ్యమంత్రి జగన్ ప్రకటంచకముందు నుండే అక్కడ చక్రం తిప్పుతున్న సాయిరెడ్డి తాజావరుస ఘటనలతో ఒక్కసారిగా అభద్రతాభావానికి గురయ్యారు. పరిస్థితులు ఈపాటికి అనుకూలించి ఉంటే రేపు జూన్ నుండి విశాఖలో జెండా ఎగరేయాలని చూస్తే కరోనా దెబ్బ కొంత, హైకోర్టు అక్షింతలు మరికొంత సాయిరెడ్డి దూకుడుకు బ్రేక్ వేశాయి. ఇప్పుడు ఏకంగా ఎల్జీ కంపెనీ ప్రమాదం స్పీడ్ బ్రేకర్ మాదిరిగా అడ్డుపడింది. మరి ఇప్పటికే సాయిరెడ్డి తీరుపై భారతీమేడమ్ కూడా అసంతృప్తితో ఉన్నారనీ, ఆయనకు చెక్ పెట్టేందుకు బంధువైన సజ్జల ను కూడా రంగంలోకి దింపారనీ కూడా చెవులు కొరుక్కుంటున్న తరుణంలో సాయిరెడ్డికి టైం అంతగా కలిసి వస్తున్నట్లు కనిపించటం లేదని పార్టీ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకైనా మంచిది సాయిరెడ్డి ఈసారి వైజాగ్ వెళ్తే స్వామి స్వరూపానందగారిని ఒకసారి కలిసి వస్తే బెటరేమో..సాయిరెడ్డి గారూ మీకు ఆల్ ది బెస్ట్ అండీ..
631839 694975Some truly select articles on this internet website , bookmarked . 88583