తమిళ సూపర్ స్టార్ విజయ్ తాజాగా యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ అనే చిత్రాన్ని చేశాడు. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కాని లాక్ డౌన్ కారణంగా షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి కాలేదు. సినిమా ఈ ఏడాది రావడం అనుమానమే అంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈ సినిమాకు వంద కోట్ల ఆఫర్ ఇచ్చిందంటూ ప్రచారం మొదలైంది.
సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు చాలా సమయం పట్టేట్టు ఉంది. అప్పటి వరకు వెయిట్ చేస్తే చాలా నష్టపోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో ఓటీటీకి మొగ్గు చూపుతున్నారంటూ తమిళ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్న కారణంగా వెంటనే నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పందించారు. సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లుగా వచ్చిన వార్తలు నిజం కాదన్నారు.
మాస్టర్ చిత్రాన్ని కాస్త ఆలస్యం అయినా కూడా థియేటర్లలోనే విడుదల చేస్తాం. ఓటీటీలో హడావుడిగా సినిమాను విడుదల చేయాల్సిన అవసరం లేదంటూ నిర్మాతలు పేర్కొన్నారు. విజయ్ వరుసగా సూపర్ హిట్స్ను అందుకుంటున్న నేపథ్యంలో మాస్టర్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. ఇప్పటికే మాస్టర్ ఆడియో కూడా విడుదల అయ్యింది. సినిమా కూడా వస్తుందనుకుంటూ ఉండగా కరోనా సీజన్ మొదలైంది.