యంగ్ హీరో నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థంపై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇరువురి జాతకరీత్యా వాళ్లిద్దరూ ఎక్కువ రోజులు కలిసి ఉండరని వేణు స్వామి చెప్పడంతో ఈ విషయంపై పెద్ద దుమారమే రేగింది. సోషల్ మీడియా లో ఆయన పై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. తాజాగా దీనిపై వేణు స్వామి స్పందించారు. ఇకపై సెలబ్రిటీల జాతకాలు గానీ, వ్యక్తిగత విశ్లేషణలు చేయబోనని తెలిపారు. దీని గురించి మాట్లాడుతూ ఓ వీడియోని రిలీజ్ చేశారు.
” మూడు రోజుల కిందట నాగచైతన్య-శోభిత బంధంపై నేను చెప్పిన జాతకం గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో నాగచైతన్య-సమంత బంధం గురించి చెప్పిన జాతకానికి కొనసాగింపుగానే ఆ వ్యాఖ్యలు చేశాను. గతంలో చెప్పినట్లుగానే ఇకపై సెలబ్రిటీల జాతకాలు, వ్యక్తిగత విశ్లేషణలు, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్పబోనని మరోసారి స్పష్టం చేస్తున్నా. ఈ విషయంపై “మా” అధ్యక్షుడు మంచు విష్ణు కి కూడా క్లారిటీ ఇచ్చాను. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనని చెప్పాను. మళ్లీ చెబుతున్న సమంత విషయంలో జరిగింది కాబట్టి.. దానికి కొనసాగింపుగానే శోభిత నాగచైతన్య-శోభిత గురించి చెప్పాను. భవిష్యత్తులో ఇలాంటి విశ్లేషణలు నా నుంచి ఇకపై ఉండబోవు” అని వీడియో లో పేర్కొన్నారు.
మరోవైపు వేణు స్వామి వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ డీజీపీని కలిసి వేణు స్వామి పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పాయి. ఈ విషయంలో మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తామని తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు ఓ ప్రకటనలో తెలిపారు.