సినీ నటుడు వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో వేణుమాధవ్కి వైద్య చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాలేయ సమస్యలతోపాటు, కిడ్నీ సమస్యలతో వేణు మాధవ్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వేణుమాధవ్ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న విషయం విదితమే. అయితే, తాను పూర్తి ఆరోగ్యంతో వున్నాననీ, పలు సినిమాల్లో నటిస్తున్నాననీ చాలా ఇంటర్వ్యూల్లో వేణుమాధవ్ చెప్పుకొచ్చాడు.
తన ఆరోగ్యంపై కొందరు కుట్రపూరితంగా కథనాలు వండి వడ్డిస్తున్నారంటూ వాపోయారాయన. ఆ ప్రచారమే తనకు సినిమా అవకాశాలు రాకుండా చేసిందనీ ఆవేదన వ్యక్తం చేశారు వేణుమాధవ్. కమెడియన్గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన వేణు మాధవ్, తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మిమిక్రీ, వేణుమాధవ్కి వెన్నతో పెట్టిన విద్య. ఆ మిమిక్రీ కళని నటనకు జోడించి, వేణుమాధవ్ అవకాశాల్ని దక్కించుకోవడమే కాదు, విజయాల్ని కూడా అందుకున్నారు.
స్టార్ కమెడియన్గా ఓ వెలుగు వెలుగుతున్న దశలో, హీరోగానూ అవకాశాలు రావడంతో, అటు వైపూ అడుగులు వేశారు. నిర్మాతగానూ ఒకటి రెండు సినిమాలు నిర్మించి, నష్టపోయారు వేణుమాధవ్. సినిమాలే కాదు, రాజకీయాల్లోనూ వేణుమాధవ్ పేరు ఒకప్పుడు గట్టిగానే విన్పించింది. తెలుగుదేశం పార్టీకి ఆయన అత్యంత సన్నిహితుడు.
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఇదిలా వుంటే, వేణుమాధవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు.
