మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. ఇరాన్కు చెందిన కీలక ఓడరేవులను అమెరికా నేవీ దళాలు దిగ్బంధిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా భారీగా నౌకాదళాన్ని మోహరించింది. ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా తెరవకపోవడంతో అమెరికా ఈ చర్యలకు దిగిందని తెలుస్తోంది.
ఇరాన్ పోర్టులలోకి ప్రవేశించే, బయలుదేరే నౌకలను అమెరికా దళాలు తనిఖీ చేస్తూ అడ్డుకుంటున్నట్టు సమాచారం. “ఏ దేశానికి చెందిన నౌకలైనా సరే, ముందుగా మా అనుమతి తీసుకోవాల్సిందే” అని అమెరికా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక అమెరికా చర్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఓడరేవులను దిగ్బంధించడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ, వెంటనే ఆ చర్యలను నిలిపివేయాలని హెచ్చరించింది. పోర్టుల దిగ్బంధం కొనసాగితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ స్పష్టం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. హర్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఎలా మారుతాయో అన్నది ప్రపంచ దేశాలు ఆతృతగా గమనిస్తున్నాయి.
