పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మూడేళ్ల క్రితం ఓ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి చెబుతూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. “యథాకాలమ్.. తథా వ్యవహారమ్” అని రాసి ఓవైపు హైదరాబాద్ సిటీని, మరోవైపు తుపాకీ గురిపెట్టినట్టు ఆ పోస్టర్ లో చూపిస్తూ ఆసక్తిని క్రియేట్ చేశారు. అయితే ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఆ ప్రాజెక్టుకి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. తాజాగా ఆ సినిమా నిర్మాత రామ్ తాళ్లూరి ఈ ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. విశ్వక్ సేన్ నటించిన “మెకానిక్ రాకీ” గ్లిమ్స్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రామ్ ని కొందరు పవన్ ప్రాజెక్టుపై స్పందించాల్సిందిగా కోరారు.
ఈ ప్రాజెక్టుపై రామ్ మాట్లాడుతూ..” ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. ప్రస్తుతం ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మా వైపు వర్క్ మొత్తం పూర్తయింది. స్క్రిప్ట్ కూడా లాక్ చేశాం. పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఇక అంతా ఆయన చేతుల్లోనే ఉంది. వారం క్రితమే ఆయనను కలిశాం. వీలు చూసుకుని సినిమాలు చెయ్యొచ్చు” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం తోపాటు మరికొన్ని శాఖలకు మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన చేస్తున్న ప్రాజెక్టులకు కాస్త బ్రేక్ పడింది. ఏమాత్రం వీలున్నా మొదటగా “హరిహర వీరమల్లు”, “ఓజీ”, ” ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే సురేందర్ రెడ్డి తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.