నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియా రీల్స్పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆన్లైన్లో దూషణలు, అవమానకర పోస్టులు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, గుంటూరు జిల్లాకు చెందిన చెన్నయ్య రుంజాల యూట్యూబ్ రీల్పై అసభ్యకర కామెంట్ చేసినట్లు గుర్తించారు. అలాగే విశాఖపట్నానికి చెందిన ఇడదాసు అప్పారావు నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు విచారణలో తేలింది. ఈ ఇద్దరినీ ట్రేస్ చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు.
ఈ కేసులో సోషల్ మీడియాలో కామెంట్లు పోస్టు చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలు, మహిళలపై అవమానకర ప్రవర్తన వంటి అంశాలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఈ చర్యల ద్వారా స్పష్టమైంది.
సోషల్ మీడియా వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, ఎవరినైనా లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా పోస్టులు చేస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే 1930 హెల్ప్లైన్కు తెలియజేయాలని సూచించారు.
