తిరుమల శ్రీవారి దర్శనం కోసం డిస్పోజబుల్ పాదరక్షలు వేసుకొచ్చిన భక్తుల వ్యవహారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు భక్తులు శ్రీవాణి టికెట్ పై వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 మీదుగా మహద్వారం వద్దకు చేరుకున్నారు. వారు డిస్పోజబుల్ పాదరక్షలు వేసుకున్న విషయాన్ని అక్కడున్న భద్రతా సిబ్బంది గుర్తించి.. వెంటనే తీసివేయించారు.
సాధారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దనే భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తారు. భక్తుల వద్ద ఏవైనా ఎలక్ట్రానిక్ డివైస్ లు, పాదరక్షలు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని రికవర్ చేసుకుని PAC వద్దకు పంపుతుంటారు. అయితే అక్కడ భద్రతా సిబ్బంది వైఫల్యం కారణంగా శ్రీవాణి టికెట్ మీద వచ్చిన అభిషేక్, ముఖేష్ అనే భక్తులు పాదరక్షలు వేసుకుని ఆలయం వద్దకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో శనివారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. టీటీడీ భద్రతా విభాగంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారంపై టీటీడీ స్పందించింది, ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఫుట్ పాత్ హాల్, డౌన్ స్కానింగ్ వద్ద ఉన్న ఇద్దరు సిబ్బందిని, ఐదుగురు సెక్యూరిటీ గార్డులను ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ వారిని సస్పెండ్ చేయాల్సిందిగా ఈవో శ్యామలరావు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎస్పీఎఫ్ సిబ్బంది ఆరుగురి పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కు ఈవో ప్రతిపాదనలు పంపారు.