తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు మార్ఫింగ్ వీడియోల ద్వారా దుష్ప్రచారం జరుగుతోందని బీఆర్ నాయుడు కోర్టును ఆశ్రయించగా, దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది.
కోర్టు ఆదేశాల ప్రకారం ఇకపై బీఆర్ నాయుడు పై నిరాధార, అపకీర్తి కలిగించే వార్తలను ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థలు ప్రసారం చేయకూడదు. ఇప్పటికే ప్రచురితమైన లేదా ప్రసారమైన కథనాలను తక్షణమే తొలగించాలని స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు సంబంధిత మీడియా సంస్థలకు ఆదేశాలు అందాయి.
అదేవిధంగా గూగుల్, ట్విట్టర్ (ఎక్స్), ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్ఫార్మ్లలో ఉన్న సంబంధిత కంటెంట్ను కూడా తొలగించాలని కోర్టు సూచించింది. ఆన్లైన్లో వైరల్ అవుతున్న వీడియోలు, పోస్టులు, మార్ఫింగ్ కంటెంట్ వెంటనే డౌన్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
తిరుమల ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా తనపై దుష్ప్రచారం జరుగుతోందని బీఆర్ నాయుడు ఆరోపించారు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ, మార్ఫింగ్ వీడియోలను ఉపయోగించి తనను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఇటువంటి చర్యల వెనుక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కోర్టు జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్ రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీటీడీ వ్యవహారాలు, తిరుమల ప్రతిష్ట, సోషల్ మీడియా దుష్ప్రచారం అంశాలపై ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. బీఆర్ నాయుడు తన ప్రకటనలో “సత్యం చివరకు గెలుస్తుంది. ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.
