సాధారణంగా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు లేదా నామినేటెడ్ పదవుల పంపిణీ జరిగినప్పుడు అధికార పార్టీలో అసంతృప్తి రావడం సహజం. వాటిని సరిగ్గా పరిష్కరించడంలోనే ఆ పార్టీ అధినేత శక్తి సామర్థ్యాలు, వ్యూహాలు ఏమిటనే సంగతి తెలుస్తుంది. తాజాగా తెలంగాణ కేబినెట్ విస్తరణ అనంతరం పలువురు నేతలు బాహటంగానే తమ అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీనే నమ్ముకున్న తమకు అన్యాయం చేశారని, గులాబీ జెండాలకు తాము కూడా ఓనర్లమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో ఓనర్లు-కిరాయిదారులు అనే నినాదం పెరిగింది. మంత్రి ఈటల రాజేందర్ తో మొదలైన వ్యవహారం.. అలా కొనసాగింది. రసమయి బాలకిషన్, నాయిని నర్సింహారెడ్డి బహిరంగంగానే తమ అసమ్మతి గళం వినిపించారు. ఇక టి.రాజయ్య, జోగు రామన్న, మైనంపల్లి హనుమంతరావు, జూపల్లి కృష్ణారావు, బాజిరెడ్డి గోవర్థన్, అరికెపూడి గాంధీ కూడా కేబినెట్ విస్తరణలో తమకు చోటు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తంచేసినట్టు వార్తలొచ్చాయి.
Also Read: కేసీఆర్: ఆల్ ఈజ్ నాట్ వెల్
వీరిలో ముగ్గురు నేతలు బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన పార్టీ అధిష్టానం.. వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగి.. వారందరితో విడివిడిగా మాట్లాడారు. అన్ని విధాలా అండగా ఉంటామని, వారి ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అదే సమయంలో ఒకవేళ పార్టీని వీడి బీజేపీలో చేరితే వెంటనే వారి శాసనసభ సభత్వం రద్దవుతుందని, అంతేకాకుండా వారిపై గతంలో ఉన్న కేసులు తెర పైకి వస్తాయని హెచ్చరించినట్టు తెలుస్తోంది.
దీంతో రాజయ్య, జూపల్లి, బాజిరెడ్డి, జోగు రామన్న మీడియా ముందుకు వచ్చి తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాము టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని, పార్టీకి విధేయంగా ఉంటామని పేర్కొన్నారు. మైనంపల్లి కూడా ఈ విషయంపై ఇదే విధంగా స్పందించే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తమ్మీద కేబినెట్ విస్తరణ తర్వాత ఒక్కసారిగా లేచిన అసమ్మతి జ్వాలలను వెంటనే తగ్గించడంలో టీఆర్ఎస్ అగ్రనేతలు విజయం సాధించారు.
