ఒకరు కాదు ఇద్దరు కాదు.. పది మందీ కాదు.. పాతిక మందీ కాదు.! దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో.! ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు రైళ్ళు ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి.!
‘కవచ్’ పేరుతో ఓ వ్యవస్థ అందుబాటులో వుంది. రెండు రైళ్ళు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా వచ్చినాగానీ, ప్రమాదం జరగకుండా.. రెండు రైళ్ళనూ ఆపేసే వ్యవస్థ అట ఇది. కొన్నాళ్ళ క్రితం కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఈ విషయాన్ని స్వయంగా ఓ రైలులో లోకో పైలట్ వెంట ప్రయాణిస్తూ చెప్పిన విషయం.
మరి, ఏమయి వుంటుంది ఒరిస్సా రైలు ప్రమాదం విషయంలో. మూడు రైళ్ళు ఎలా ఒకదాన్నొకటి ఢీకొన్నాయి.? అందులో ఒకటేమో గూడ్సు రైలు కాగా, మరో రెండు ప్రయాణీకుల రైళ్ళు.. పైగా ఎక్స్ప్రెస్ రైళ్ళు.. అందునా సూపర్ ఫాస్ట్ రైళ్ళు.
ఓ రైలు పట్టాలు తప్పిందనీ, ఈ క్రమంలో వేరే ట్రాక్ మీద పడ్డ బోగీల్ని అటు వైపుగా వస్తున్న ఇంకో రైలు ఢీకొందనీ అంటున్నారు. ఇదెంత నిజం.? రెండు రైళ్ళు ప్రమాదానికి గురైనప్పుడు, మూడో రైలు అటు వైపుగా ఎలా వచ్చింది.?
బోల్డన్ని అనుమానాలున్నాయి ఒరిస్సా రైలు ప్రమాదం విషయంలో. రైల్వే మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్లు మామూలే. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామనీ, మృతుల కుటుంబాల్ని ఆర్థికంగా ఆదుకుంటామనీ.. కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
దేశంలో హై స్పీడ్ రైళ్ళ దిశగా వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని పదే పదే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తూ వస్తున్నారు. పబ్లిసిటీ ఇలా వుంటే, రియాల్టీ.. ఇదిగో రైలు ప్రమాదాల రూపంలో కనిపిస్తోంది.