Train Accident: ఒడిశా లో మహావిషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బాలేశ్వర్ లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరుకుంది. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఘటన స్థలలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే క్షతగాత్రులను త్వరితగతిన ఆసుపత్రిలో చేర్చేందుకు హెలికాప్టర్లు ఘటనస్థలి వద్దకు చేరుకున్నాయి. ఎన్డిఆర్ఎఫ్, ఒడిఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాద స్థలం వద్దకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద ఘటనకు గల కారణాలను ఇప్పుడే వెల్లడించలేమని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మృతుల్లో, క్షతగాత్రుల్లో తమిళనాడుకు చెందిన పలువురు ఉండటంతో తమిళనాడు సీఎం స్టాలిన్ ఒడిశా కి పయనమయ్యారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ప్రమాద ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు ఉన్నారా లేదా అనే దానిపై దృష్టి పెట్టాలని అధికారులని ఆదేశించారు. వారికి ఎలాంటి సాయం కావాలన్నా నిత్యం అందుబాటులో ఉండి పర్యవేక్షించాలని తెలిపారు.
ప్రమాదం జరిగిందిలా..
స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్ లోని హౌరా కి వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒడిస్సా లోని బాలేశ్వర్ వద్ద శుక్రవారం రాత్రి 7:00 సమయంలో పట్టాలు తప్పింది. దీంతో దాని బోగీలు కొన్ని పక్కనే ఉన్న పట్టాలపై పడిపోయాయి. వాటిని షాలిమార్- చెన్నై కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొంది. దీంతో కోరమండల్ రైళ్లలోని 15 బోగీలు బోల్తా పడ్డాయి. అయితే ఈ ట్రైన్ భోగిలను అదే పట్టాలపై దూసుకు వచ్చిన గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఇలా మూడు రైళ్లు ఢీ కొనడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో బాధితులు ఎక్కువ భాగం పశ్చిమబెంగాల్ కి చెందిన వారే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.