Tollywood: సినిమాల ప్రదర్శనలో మల్టీప్లెక్స్ లకు ఇచ్చే పర్సంటేజీ విధానాన్ని తమకు ఇవ్వాలని కొందరు ధియేటర్ యజమానులు గతంలో విన్నవించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని 23 సింగల్ స్క్రీన్ థియేటర్లో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేస్తూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సింగల్ స్క్రీన్ థియేటర్లు అద్దె పద్ధతుల్లో కొనసాగేవి. ఇకపై మల్టీప్లెక్స్ లకు ఇచ్చే పర్సంటేజ్ విధానంతో సింగల్ స్క్రీన్లు కూడా రన్ అవుతాయని.. తాము లాభపడతామని భావించారు. అయితే తెలంగాణ ఫిలిం ఛాంబర్ నిర్ణయాన్ని నిర్మాతల గిల్డ్ తీవ్రంగా వ్యతిరేకించింది. మల్టీప్లెక్స్ కి ఇచ్చే పర్సంటేజీ విధానాన్ని సింగల్ స్క్రీన్ ధియేటర్లకు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల గిల్డ్ మధ్య వివాదం తలెత్తింది.
తమకు పర్సంటేజీ విధానం ఇస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఓవైపు ఫిలిం ఛాంబర్ చెబుతోంది. దీనికి ఇతర రాష్ట్రాల్లో కూడా సింగల్ స్క్రీన్ ధియేటర్లలో పర్సంటేజీ విధానమే అమలవుతున్న ఉదాహరణలు చూపించింది. థియేటర్లు మనుగడ సాగించే క్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ తీసుకొనే నిర్ణయాన్ని నిర్మాతలు గిల్డ్ ఎలా వ్యతిరేకిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏప్రిల్ 30లోగా సింగల్ స్క్రీన్ లకు పర్సంటేజీ విధానంపై నిర్మాతల గ్రిల్ నిర్ణయం తీసుకోకపోతే మే ఒకటి నుంచి సింగల్ స్క్రీన్లు థియేటర్లు మూసివేస్తామని తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్ సంఘం వెల్లడించింది. ఇప్పుడు ఎవరి పంతం నెగ్గుతుందోనని ఫిలిం నగర్లో హాట్ టాపిక్ గా మారింది. వేసవిలో వచ్చే సినిమాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
