సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చేసిన తీర్పుతో ‘సిట్’ ఉనికి ప్రశ్నార్థకం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఖేల్ ఖతం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనైపోయింది.. ఇలా విశ్లేషణలు షురూ అయ్యాయి వైసీపీ మేతావుల నుండి.
జరిగింది ఫస్ట్ హియరింగ్ మాత్రమే.. అది కూడా, తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి. కానీ, ‘సిట్’ వ్యవహారం వేరు. తిరుపతి లడ్డూ వ్యవహారం దగ్గర్నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, గత ఐదేళ్ళలో జరిగిన అనేకానేక వ్యవహారాలపై ‘సిట్’ ఏర్పాటయ్యిందన్నది ప్రభుత్వం చెబుతున్న విషయం.
టీటీడీ ఛైర్మన్గా వున్న సమయంలో వైవీ సుబ్బారెడ్డి, ఆయా సేవల ధరలకు సంబంధించి వేలం పాట పాడేశారు అధికారులు, బోర్డు సభ్యుల సమావేశంలో. ఇంకోపక్క, లడ్డూ సహా, ఇతర ప్రసాదాల్లో వినియోగించే నెయ్యికి సంబంధించిన టెండర్ల వ్యవహారాలు, అన్య మతస్తుల డిక్లరేషన్ వ్యవహారానికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు.. ఇలా చాలానే వున్నాయ్.
ఇంకో ముఖ్యమైన అంశమేంటంటే, టీటీడీ ఈవోగా, ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహించిన ధర్మారెడ్డి, ఆయన అనుసరించిన వైఖరి కూడా.! చెప్పుకుంటూ పోతే చాలా చాలా వున్నాయ్.. వాటిల్లో మళ్ళీ ప్రజా ప్రతినిథుల ప్రత్యేక ప్రోటోకాల్ దర్శనాలు, వాటిని అడ్డంగా వాడేసి కుప్పలు తెప్పలుగా అనుచరుల్ని వెంటేసుకు వెళ్ళడం.
ఇవన్నీ కూడా నాణేనికి ఓ వైపు మాత్రమే. టీటీడీ, దేశవ్యాప్తంగా పలు చోట్ల దేవాలయాల్ని నిర్మించింది, నిర్మిస్తోందని.. అది తమ పాలన ఘనతేనని వైసీపీ చెప్పుకుంటోంది. కానీ, వాటికి వెచ్చించిన నిధులు, ఆయా దేవాలయాల నిర్మాణాలకు కాంట్రాక్టులు పొందిన వ్యక్తులు.. వీటిపైనా చాలా చాలా అనుమానాలున్నాయ్ సగటు హిందువులకి.
కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, ఇప్పటికే తిరుమలకు వెళ్ళి, పలు అంశాలపై ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏయే అంశాలపై ఆరా తీసిందన్నదానిపై స్పష్టత లేదు. సర్వోన్నత న్యాయస్థానం, లడ్డూ ప్రసాదానికి సంబంధించిన కేసులో, ‘సిట్’ని వివరాలు అడిగితే, ‘సిట్’ ఏయే వివరాలు అందిస్తుందన్నది అప్పుడు తేలుతుంది.
ఎలా చూసినా విషయం మనం చూస్తున్నదానికంటే కూడా చాలా చాలా పెద్దది.!
