వర్షాకాలం మొదలైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఎంత ఎండలోనైనా ప్రయాణం చేయగలం కానీ.. కొన్ని చినుకులు పడినా కూడా ఏ పని చేయలేం. ఉన్నట్టుండి వర్షం పడిందా.. ఇక అప్పటివరకు వేసుకున్న ప్లాన్స్ అన్నీ పక్కన పెట్టేయాల్సి వస్తుంది. ఇక రైతుల బాధలైతే వర్ణనాతీతం. కష్టపడి పండించుకున్న పంట అంతా నీటిపాలైపోతుంది. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల యాప్ లను తీసుకొచ్చింది. అవేంటో చూద్దాం.
Damini
వర్షం పడే అవకాశాన్ని ముందుగానే పసిగట్టొచ్చు. కానీ పిడుగులు పడటాన్ని మాత్రం కనిపెట్టడం కష్టం. అలా అకస్మాత్తుగా పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. పిడుగుల గురించి ముందుగానే హెచ్చరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ పేరు “దామిని”. నిజానికి ఈ యాప్ ని “ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయరాలజీ” 2020 లోనే రూపొందించింది. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని జిపిఎస్ లోకేషన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. వర్షం పడేటప్పుడు ఈ జిపిఎస్ లొకేషన్ ఆధారంగా మీరున్న ప్రదేశంలో పిడుగులు పడతాయో లేదో అరగంటకు ముందే తెలుసుకోవచ్చు. 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల పడే సమాచారాన్ని ఈ యాప్ ఇస్తుంది. అంతేకాకుండా పడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెబుతుంది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ లో Damini : Lighting alert ” పేరుతో అందుబాటులో ఉంది.
రైతుల కోసం Meghdoot
అకాల వర్షాలు పడితే ఎక్కువ నష్టపోయేది రైతులే. అప్పటివరకు కష్టపడి పండించిన పంట ఒకసారిగా వర్షార్పణం అయితే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి పంటను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రారు. ఫలితంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల నుంచి రైతన్నలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం యాప్ ని తీసుకొచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ యాప్ ని రైతులకు అందుబాటులోకి తెచ్చాయి. ఈ యాప్ ద్వారా వాతావరణ సూచనలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందవచ్చు. కాలానికి అనుగుణంగా ఎలాంటి పంటలు వేయవచ్చు?. ఆయా ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, గాలి దిశ, తేమ గురించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ యాప్ పేరు Meghdoot. 13 భాషల్లో ఇందులో సమాచారం ఉంటుంది. నాలుగు రోజులపాటు వాతావరణం ఎలా ఉంటుందనేది ముందుగానే దీని ద్వారా తెలుసుకోవచ్చు.