Chiranjeevi: చిరంజీవి.. ‘ఈ పేరే చాలా పవర్ ఫుల్ కదా’ అని దేవిశ్రీ ప్రసాద్ తనతో అన్నాడని దర్శకుడు సుకుమార్ ఓ సందర్భంలో అన్నారు. నిజమే అని నిరూపించే చాలా ఉదాహరణలు, సందర్భాలూ ఉన్నాయి. తెలుగు సినిమాకు మగమహారాజు చిరంజీవి. అదే ఆయనకు శ్రీరామరక్ష. ప్రేక్షకుల్లోనే కాదు, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో ఉద్దండుల్లో కూడా చిరంజీవి ఓ శిఖరం. అందుకే 100 కాదు.. 1000 మందిలో ఒకడిగా ఆయనకు గుర్తింపు.. ప్రత్యేక స్థానం దక్కుతుంది. ఇందుకు నిదర్శనం, తెలంగాణ ఫ్యూచర్ సిటీలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు. వ్యాపార దిగ్గజాలతోపాటు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రముఖంగా చిరంజీవికి తగిన గుర్తింపునిచ్చి ఆయన స్థాయిని చెప్పింది.
ప్రభుత్వ ఆహ్వానంపై చిరంజీవి తన రోల్స్ రాయిస్ కారులో సదస్సుకు వెళ్ళొచ్చు.. ఘన స్వాగతం అందుకోవచ్చు. కానీ, చిరంజీవికి అంతకుమించి గౌరవం ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చిరంజీవి కోసం ప్రత్యేక హెలికాఫ్టర్ ఏర్పాటు చేశారు. పరిశ్రమ తరపున చిరంజీవికి అందించిన గౌరవ, మర్యాదలు ఆయన స్థాయికి నిదర్శనం. చిరంజీవి కూడా అంతే వినయంతో వారి స్వాగతాన్ని మన్నించి సదస్సుకు వెళ్ళారు. మరోవైపు.. దేశంలో అగ్రగామి పారిశ్రామికవేత్తల్లో ఒకరైన మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన చిరంజీవిని ఉద్దేశిస్తూ.. ‘మొత్తానికి మెగాస్టార్ చిరంజీవిగారిని కలుసుకున్నా. ఆయనొక లెజెండ్. తన వ్యక్తిత్వం, వినయం చిరంజీవిని ఎంతో విలక్షణంగా, ప్రత్యేకంగా చూపుతోంద’ని రాసుకొచ్చారు.
I was in Hyderabad yesterday to address the Telangana Rising Global Summit.
Apart from the privilege of interacting with Chief Minister Revanth Reddy Garu, on the subject of the Vision 2047 plan for the state, it was an unexpected surprise to be able to finally meet Megastar… pic.twitter.com/m9vJoXXbM5
— anand mahindra (@anandmahindra) December 10, 2025
సింపుల్ గా.. చిరంజీవి అంటే ఇదే. తనను చిరంజీవిగాకాక తెలుగు సినిమా ప్రతినిధిగా ఆహ్వానించారని విధేయత చూపారు. పరిశ్రమ బాగు కోసం ప్రభుత్వ నిర్ణయాలకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ప్రకటించారు. పరిశ్రమకి ఇస్తున్న గుర్తింపుపై ప్రభుత్వాన్ని అభినందించారు. దశాబ్దాలుగా ఉన్న తన No.1 స్థానాన్ని, సినిమాల్నీ వదిలి రాజకీయాల్లో 9ఏళ్లు ఉన్నారు. అన్నేళ్ళలో చిరంజీవి వదిలెళ్ళిన కుర్చీ అలానే ఉండిపోయింది. మళ్ళీ చిరంజీవే వచ్చి ఇప్పటికి చేసిన ఆరు సినిమాల్లో మూడు, ఒకొక్కటీ 100కోట్ల షేర్ తో మళ్ళీ తన రాజసాన్ని చూపారు. తెలుగు సినిమా, బాక్సాఫీస్, ప్రేక్షకుల మనసుల్లో చిరంజీవి చేసిన చెరగని సంతకం ఇదే. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలనే పెద్దల మాటను చిరంజీవి పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు చిరంజీవిపై తెలంగాణ ప్రభుత్వ తీరే ఉదాహరణ.

