Peddi: మరో 12రోజుల్లో విడుదలకానున్న రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీకి మరో చిక్కొచ్చిపడింది.’‘పెద్ది’కి ఆంధ్రాలో టికెట్ రేట్ల పెంపు ఉండొచ్చేమో కానీ, తెలంగాణలో పెంపులేదు. టికెట్ రేట్లు పెంచొద్దని, పెంచి ప్రేక్షకులను చంపొద్దని సీఎం రేవంత్ రెడ్డి, ఎగ్జిబిటర్లు, ఛాంబరులో లేఖ ఇచ్చా’మని తెలంగాణ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచినా డిమాండ్, సప్లయ్ ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సమావేశమై మాట్లాడారు.
‘‘పెద్ది’ సినిమాకు పర్సంటేజీ విధానం అమలు చేయాల్సిందే. తెలంగాణలో పర్సంటేజ్ ప్రకారమైతేనే ఇకపై తమ ధియేటర్లలో సినిమాలు ఆడిస్తాం. ‘పెద్ది’ సినిమాపై మాకేం కోపం లేదు. నిర్మాతల నిర్లక్ష్యం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ‘పెద్ది’ని గొడవ నుంచి మినహాయించాలని అనుకున్నాం. కానీ, తర్వాత మళ్లీ మమ్మల్ని పట్టించుకుంటారనే నమ్మకం లేదు. అందుకే ‘పెద్ది’ని కూడా పర్సంటేజ్ శ్లాబ్ లో చేర్చాలని నిర్ణయించుకున్నాంఈ వివాదాన్ని చిరంజీవిగారి దృష్టికి తీసుకెళ్తాం’.
‘హరి హర వీరమల్లు’ సమయంలోనే రెండు, మూడుసార్లు చర్చలు జరిగాయి. రెండు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని ఏడాది చేశారు. ముందు మూడు వారాలని మళ్లీ మూడు వారాలు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 120 మంది థియేటర్ల యజమానులు దీనస్థితిలో ఉన్నారు. నిర్మాతలకు 14రకాలుగా ఆదాయం వస్తుంటే ఎగ్జిబిటర్లకు ఆదాయం లేదు.. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో పర్సంటేజీ విధానమే ఉంటే ఇక్కడే రెంట్స్ అమలులో ఉంది. ఇకపై థియేటర్లో సౌండ్ సిస్టమ్, ఏసీలను బట్టి కాదు.. వచ్చే కలెక్షన్లను బట్టి గ్రేడింగ్ చేయాల్సిందే’నని స్పష్టం చేశారు.
