Chiranjeevi: ‘సినిమా ధియేటర్ల మనుగడకు పర్సంటేజీ విధానం కోరుతున్నామని.. ఇది ‘పెద్ది’కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు.. ఇండస్ట్రీ’దని తెలంగాణ టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం ధియేటర్లు, పర్సంటేజీ విషయంలో నెలకొన్న సమస్యపై తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేశ్ బాబు, కేఎల్ నారాయణ తదితరులు చిరంజీవితో ఆయన ఇంట్లో దాదాపు గంటన్నరపాటు భేటీ అయ్యారు. భేటీలో సమస్యలను చిరంజీవికి విన్నవించారు. సమావేశం అనంతరం దిల్ రాజు, ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ..
‘సింగిల్ ధియేటర్లో సినిమాల ప్రదర్శన, రెంటల్-పర్సంటేజీలపై తేడాలు, ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్లపై ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకోగా చిరంజీవి సానుకూలంగా స్పందించారు. ‘ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా’ అంటూ సింగిల్ స్క్రీన్ సమస్యలపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నుంచి వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తానన్నారు. ఎగ్జిబిటర్లతో మాట్లాడి మేమూ తుది నిర్ణయం తీసుకుంటాం. రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా’మని అన్నారు. చిరంజీవి సైతం వారితో.. అందరూ ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలని, రాబోయే సినిమాలకు ఇబ్బంది లేకుండా ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.
