జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి.? అన్న విషయమై తెలుగుదేశం పార్టీలో అంతర్గత చర్చ జరిగితే సరిపోదు.! టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరగాలి.! రెండు పార్టీలూ కలిసి కూర్చుని, చర్చించుకున్నాక ఓ నిర్ణయానికి వస్తాయ్.!
భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో కలిస్తే.? ఈ ఆలోచనతోనే, సీట్ల పంపకాల విషయమై ఇటు టీడీపీ అటు జనసేన.. ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. వాస్తవానికి, జనసేన పార్టీ మీద తొలుత వలపు బాణం విసిరింది నారా చంద్రబాబునాయుడే.
‘జనసేన పార్టీతో కలవడానికి సిద్ధంగా వున్నాం. కానీ, వన్ సైడ్ లవ్ వల్ల ప్రయోజనం లేదు కదా.?’ అంటూ చంద్రబాబు తొలుత పొత్తుల ప్రస్తావన తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ముఖ్య నేతలతో చర్చించారు. వైసీపీని దించాలంటే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న తన ఆలోచనని పార్టీ ముఖ్య నేతలతో సంచుకున్నారు జనసేనాని.
అదే విషయాన్ని పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఏర్పాటైన ఓ బహిరంగ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా టీడీపీ – జనసేన కలవడానికి చాలా సమయం పట్టిందనుకోండి.. అది వేరే సంగతి.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు అరెస్టయ్యాక, పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన టీడీపీ శ్రేణులకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధైర్యాన్నిచ్చారన్నది బహిరంగ రహస్యం. ఆ విషయాన్ని అటు చంద్రబాబుగానీ, ఇటు ఆయన తనయుడు నారా లోకేష్గానీ.. అంత తేలిగ్గా మర్చిపోతారనుకోలేం.
అయితే, మొదటి నుంచీ టీడీపీ మీద తమదే పెత్తనం.. అన్న భ్రమల్లో వున్న టీడీపీ అను‘కుల’ మీడియా, 2019 ఎన్నికల్లో ఎలాగైతే తన ‘అతి’తో టీడీపీని నాశనం చేసిందో, ఇప్పుడూ అదే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పోటీ చేయబోయే సీట్లను ఆ ‘కుల’ మీడియా ఖరారు చేసేసింది. దాంతో, టీడీపీ అవాక్కయ్యింది.. జనసేన నవ్వుకుంది. జనసేనకు దారిచ్చి, వ్యూహాత్మకంగా పక్కకు తప్పుకున్న టీడీపీ నాయకులు కొందరు, తమ సామాజిక వర్గానికే చెందిన ‘కుల’ మీడియా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘చంద్రబాబుని మళ్ళీ జైలుకు పంపించేసి, టీడీపీని నాశనం చేసే దిశగా కుల మీడియా కంకణం కట్టుకున్నట్టుంది. టీడీపీ – జనసేన పొత్తు విషయమై కుల మీడియా అతి చూస్తోంటే, వైసీపీకి పూర్తిగా అమ్ముడుపోయినట్లే కనిపిస్తోంది..’ అన్న భావన టీడీపీలో వ్యక్తమవుతోంది.
నిజానికి, ఈ కుల మీడియా అంతా నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తోందన్న వాదన ఒకటుంది. కానీ, లోకేష్ని సైతం జస్ట్ వెర్రి వెంగళప్పలా భావించే ఆ కుల మీడియా, లోకేష్ విసిరే ఎంగిలి మెతులకు కక్కుర్తి పడటం మామూలుగానీ, వైసీపీ నుంచి సరైన ప్యాకేజీ దొరికితే.. చంద్రబాబుని ముంచేయకుండా వుంటుందా.?
వున్నపళంగా చంద్రబాబు డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగకపోతే, కుల మీడియా సృష్టించే అభూతకల్పనలకి టీడీపీ పూర్తిగా కాలగర్భంలో కలిసిపోక తప్పదు