అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. వైఎస్ఆర్సిపి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కొమ్ముకాసిన అధికారుల్లో భయం మొదలైంది. ఈ నేపథ్యంలో తనని వేధించిన ఎస్పీ కి టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ తన స్టైల్ లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనపై అక్రమ కేసులు బనాయించి తనని వేధించిన ఎస్పీని వదిలేది లేదంటూ హెచ్చరించారు. ఈ మేరకు పట్టాభి గతంలో కృష్ణాజిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా ఇంటికి వెళ్లారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.
‘ నాపై అక్రమ కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ తో రాచ మర్యాదలు చేసిన ఎస్పీ జాషువా ని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాను. ఆయన కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు తోటవల్లూరు పోలీస్ స్టేషన్ లో నన్ను నిర్బంధించి అర్ధరాత్రి సమయంలో కరెంటు తీసేసి మరీ నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయనని కలిసి సత్కరించాలని వచ్చాను. ఆయన తనకున్న ఏడెకరాల విశాలమైన ఫామ్ హౌస్ లో ఉన్నారని తెలుసుకొని శాలువ, పూల బొకే తీసుకుని వచ్చాను. కానీ ఆయన ఇక్కడ లేరు. నిన్నటి నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని తెలిసింది. అందుకే ఈ శాలువా, బొకేని ఇక్కడే పెట్టి వెళుతున్నా’ అని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పట్టాభి.. తనకు రాచ మర్యాదలు చేసిన ఎస్పీని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఇప్పటికే ఎస్పీ ఫోన్ కి పంపించినట్లు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
అప్పటి టీడీపీ నేత వల్లభనేని వంశీ.. వైసీపీ కి మద్దతిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. ఆ కారణంతో కొందరు గన్నవరంలోని టీడీపి ఆఫీస్ ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న హింసకు పట్టాభిరామ్ కారణమయ్యారన్న నెపంతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.
2023 ఫిబ్రవరి 20న పట్టాభిని తోటవల్లూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత ఆయన్ని కోర్టుకి అప్పజెప్పే సమయంలో ఆయన ఒంటిపై గాయాలు కనిపించాయి. ఆయనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు పట్టాభిరామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల హింస మరింత పెరిగిందని అప్పట్లో కృష్ణాజిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా మీడియాకి తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న పట్టాభి బుధవారం ఎస్పీని కలవడానికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారు.
